హైదరాబాద్ తరహాలో చేద్దామనుకున్నా: అత్యంత అవినీతి పరుడు జగన్: చంద్రబాబు ఫైర్..!
ఏపీలో ఇసుక..ఇంగ్లీషు మీడియం వివాదాలు ముగుస్తున్న వేళ..మరోసారి రాజధాని వివాదం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హాయంలో రాజధానిలో ఎటువంటి పనులు జరగలేదంటూ మంత్రులు చేస్తున్న విమర్శలను..తిప్పి కొడుతూ..తన హాయంలో జరిగిన నిర్మాణాలను చూపించటానికి చంద్రబాబు రాజధానిలో పర్యటించాలని నిర్ణయించారు. దీనిపైన ప్రకటన వచ్చిన వెంటనే వైసీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. రాజధానిలో ఒక వర్గం రైతులు ఆందోళన బాట పట్టారు. ఇక..పర్యటనలో నిరసనలు తారా స్థాయికి చేరాయి. చంద్రబాబు కాన్వాయ్ మీదకు రాళ్లు.. చెప్పులతో దాడికి ప్రయత్నించారు. టీడీపీ..వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే, చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి పైన ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లిందీ..ఇప్పుడు ఏం జరిగిందీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు..
నల్ల జెండాలు..గోబ్యాక్ నినాదాలు: చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా: కార్యకర్తల బాహాబాహీ..!
హైదరాబాద్ తరహాలో చేద్దామనుకున్నా..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. ఆయన అమరావతి పర్యటన సమయంలో ముఖ్యమంత్రి నిరసనలు వ్యక్తం కావటం పైన ఆవేదన వ్యక్తం చేసారు. రాజధాని లేని ఏపికి హైదరాబాద్ తరహాలో రాజధాని తీర్చి దిద్దాలనే లక్ష్యంతో తాను ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తే ..ఇప్పటి ప్రభుత్వం పూర్తిగా విరుద్దంగా వ్యవహిరిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో అమరావతిలో ఒక్క ఇటు కూడా వేయలేదని..జరుగుతున్న నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసారని చెప్పు కొచ్చారు. రాజధాని విషయంలోనే ఇలా వ్యవహరిస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు.
అమరావతిని నాశనం చేయాలని..
ఆర్దికంగా ఇబ్బందుల్లో రాష్ట్రంలో రాజధాని నిర్మాణం అంత సులువైన విషయం కాదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను రైతులను ఒప్పించి 43 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం సమీకరించిన విషయాన్ని గుర్తు చేసారు. సింగపూర్ సంస్థలకు పైసా చెల్లించకుండా రాజధాని నిర్మాణ ప్రణాళికలు తీసుకున్నామని..వారితో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ కోసం అగ్రిమెంట్ చేసుకుంటే వైసీపీ ప్రభుత్వం దానిని రద్దు చేసిందంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఇక, రాజధానిలో పలు సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేసారని విమర్శించారు. ప్రభుత్వ విధానాలు చూసిన తరువాత ఏ సంస్థ అయినా ఏపీలో పెట్టుబడులకు ముందుకు వస్తుందా అని చంద్రబాబు ప్రశ్నించారు.
మాది కాదు..జగన్ అత్యంత అవినీతి పరుడు
మా ప్రభుత్వ హయాంలో రాజధాని పేరుతో అవినీతి జరిగిందని నాటి నుండి నేటి వరకు వైసీపీ ఆరోపణలు చేస్తూనే ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైందని..దీని కోసం ప్రత్యేకంగా కమిటీ వేసారని..మరి ఎందుకు ఇప్పటి వరకు తేల్చలేకపోయారని చంద్రబాబు ప్రశ్నించారు. బాధేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. భావితరాల భవిష్యత్ను నాశనం చేస్తున్నారని విమర్శించారు. దేశంలోనే అత్యంత అవినీతి పరుడు జగన్ అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తన మీద అవినీతి ఆరోపణలు పెట్టుకొని..ఎదుటి వారి మీద ఆరోపణలు చేయటం జగన్ కు అలవాటు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.