పద్మశ్రీ జాబితాలో ఛాయ్వాలా.. ప్రకాష్ రావు మన తెలుగువారే..!
పద్మశ్రీ పురస్కారం జాబితాలో సామాన్యుడికి చోటు దక్కింది. ఓ ఛాయ్వాలాకు అరుదైన గౌరవం లభించింది. సంపాదించే దాంట్లో కొంత సమాజ సేవకు ఉపయోగించాలనే ఆయన సంకల్పం.. పద్మశ్రీ తనను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. ఏపీకి చెందిన దేవరపల్లి ప్రకాష్ రావు అనే తెలుగు వ్యక్తిని ఒడిషా ప్రభుత్వం సిఫార్సు చేయడంతో.. సామాన్యుడికి అసాధారణమైన గుర్తింపు దొరికింది.
సామాన్యుడికి అరుదైన గౌరవం
దేశం గర్వించే పనిచేసినోళ్లకి, అలాగే సమాజసేవలో ముందుండే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డుల్లో ప్రకాష్ రావుకు చోటు దక్కడం హర్షణీయం. అయితే ఇప్పటివరకు క్రీడాకారులు, కళాకారులు లాంటి వారిని మాత్రమే తెలుగు రాష్ట్రాలు సిఫార్సు చేశాయి. ప్రకాష్ రావు లాంటి సామాన్యులకు ఛాన్స్ దక్కలేదనే చెప్పాలి. ఒడిషాకు వలస వెళ్లిన తెలుగు ఆణిముత్యాన్ని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఆయన చేసిన సేవలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పద్మశ్రీ వచ్చేలా చొరవ తీసుకుంది.
సంఘసేవ.. ఆదాయంలో సగం అటే
ఏపీకి చెందిన ప్రకాష్ రావు పూర్వీకులు చాలా సంవత్సరాల కిందట ఒడిషాకు వలస వెళ్లారు. ఆ నేపథ్యంలో కటక్ లోని బక్సీ బజార్ ప్రాంతంలో టీ కొట్టు పెట్టుకుని.. దానిపై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. టీ అమ్మడం ద్వారా రోజుకు ఆయన దాదాపు 600 రూపాయల దాకా సంపాదిస్తారు. అందులో కొంతభాగం కుటుంబ ఖర్చులకు వినియోగించుకుంటూ మిగతా మొత్తం పేదల కోసం ఖర్చు పెడుతున్నారు. అంతేకాదు పాలు, బ్రెడ్ లాంటివి ఫ్రీగా అందిస్తున్నారు. ఇదంతా కూడా 40 సంవత్సరాల నుంచి కొనసాగిస్తుండటం విశేషం. అదలావుంటే తన రెండు గదుల ఇంటినే బడిగా మార్చారు ప్రకాష్ రావు. పిల్లలకు చదువు నేర్పిస్తూ ఉచిత భోజనం పెడుతున్నారు. ప్రకాష్ రావు స్కూల్ ఏర్పాటు చేసేంతవరకు అక్కడ బడి అంటేనే తెలియని పరిస్థితి. కూలీ పనులు చేసుకునేవారు ఎక్కువగా ఉండే ఆ ఏరియాలో బడి ఏర్పాటు చేసి, వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు ప్రకాష్ రావు.
సేవకు గుర్తింపు.. వరించిన పద్మశ్రీ
ప్రకాష్ రావు సేవలను గుర్తించిన ఒడిషా ప్రభుత్వం ఆయన పేరును పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేసింది. ఆ మేరకు ఎంక్వైరీ చేసిన కేంద్ర హోంశాఖ ఓకే చెప్పింది. దీంతో ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అవార్డు రావడం తనకెంతో ఆనందం కలిగించిందంటున్నారు ప్రకాష్ రావు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తి కారణంగా తనకు పద్మశ్రీ వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రధాని కార్యాలయం నుంచి తనకు ఫోన్ రావడం, జీవితంలో మరచిపోలేని రోజు అంటున్నారు.