చంద్రబాబు అమరావతి పర్యటన లో టెన్షన్ ... వ్యతిరేకిస్తూ ఒక వర్గం , స్వాగతిస్తూ మరో వర్గం ఫ్లెక్సీలు
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు రాజధాని పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు గోబ్యాక్ అంటూ అక్కడ బాబు రాకను వ్యతిరేకిస్తున్న ఒక వర్గం రైతులతో పాటు వైసిపి కార్యకర్తలు నినాదాలు చేస్తూ, నల్లజెండాలతో నిరసన తెలిపారు. చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు విసిరారు. చంద్రబాబు అమరావతి పర్యటనను అడ్డుకునేందుకు అడుగడుగునా యత్నించారు. ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు విసిరారు. ఈ నేపథ్యంలో ఘర్షణ జరగకుండా టీడీపీ ,వైసీపీ వర్గీయులను రోప్ పార్టీ అడ్డుకుంది.
ఉండవల్లి కరకట్టపై చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
మరోవైపు ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు సగం ఫొటోలు, నల్లఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రైతు కూలీలు నిరసన తెలిపారు. చంద్రబాబు రాజధాని రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేక పోయాడని వారు ఫ్లెక్సీలలో పేర్కొన్నారు. రాజధాని రైతులు, రాజధాని రైతు కూలీలకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని వారి జీవన ప్రమాణాలు ఇస్తానని నమ్మబలికి మోసం చేశారని ఏ మొహం పెట్టుకొని అమరావతి వస్తారు అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.
రాజధానిలో చంద్రబాబు పర్యటన నేడే .. రాజకీయవర్గాల్లో ఆసక్తి
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన పర్యటన వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు
అంతేకాదు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేశారు కానీ రైతులకు ఇస్తానన్న స్థలాల అభివృద్ధిలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా రైతులకు వాణిజ్య స్థలమని చెప్పి నమ్మబలికి ఒక రైతుకు కూడా వ్యాపారం చేసుకునే లాగా స్థలం ఇవ్వలేదని ఫ్లెక్సీ లో పేర్కొన్నారు . రాజధానిలో ఉన్న నీ సొంత ఆస్తులు కాపాడుకోవడం కోసమే, వాటి విలువలు పెంచుకోవడం కోసమే పర్యటన చేస్తున్నారని రైతులను మోసం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం రైతులు తమకు క్షమాపణ చెప్పిన తరువాతే రాజధానిలో అడుగు పెట్టాలని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.
చంద్రబాబు రాకను స్వాగతిస్తూ కూడా ఫ్లెక్సీలు
గ్రామ కంఠాల సమస్యను చంద్రబాబు ఎందుకు పరిష్కరించలేదని వారు ప్రశ్నించారు. మరోపక్క చంద్రబాబు పర్యటనకు మద్దతు తెలపుతూ కార్యకర్తలు, పార్టీ నేతలు, కొందరు రాజధాని రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోటాపోటీగా ఒకరిని మించి ఒకరు తలపడుతున్న విధానం రాజధానిలో టెన్షన్ రేకెత్తిస్తుంది. టిడిపి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా రాజధానిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నం జరుగుతుంటే, కొనసాగించాలని టిడిపి ప్రయత్నిస్తోంది.
బాబుకు అండగా ఉండటం అంటే రాష్ట్రానికి అండగా ఉండటమే అని అనుకూల ఫ్లెక్సీలు
ఇక చంద్రబాబు రాష్ట్ర రాజధానిని ఎంతో గొప్పగా అభివృద్ధి చెయ్యాలని ప్రయత్నం చేశారని, ఇప్పుడు వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యంగా మారిందని, చంద్రబాబు అమరావతి పర్యటనను స్వాగతిస్తూ ఫ్లెక్సీలను ఇంకో వర్గం రైతులు ఏర్పాటు చేశారు . బాబుకు అండగా ఉండటం అంటే రాష్ట్రానికి అండగా ఉండటమే అని బాబుతోనే ఉందాం అని వారు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మొత్తానికి చంద్రబాబు రాజధాని పర్యటన రసాభాసగా మారుతుంది.