కేసీఆర్ బాటలో చంద్రబాబు..! ఎన్నికల అభ్యర్థులను ముందుగా ప్రకటించేందకు సన్నాహాలు.!!
Recommended Video
హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలే సమయం ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు కసరత్తు ముమ్మరం చేశారు. జాబితా విడుదలకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలిసింది. ఇది ధనుర్మాసం కావడంతో.. సంక్రాంతికి నెలరోజుల ముందు వరకూ శుభ ముహూర్తాలు ఉండవని తెలుస్తోంది. జనవరి 17వ తేదీవరకు కూడా శుభఘడియలు లేవని సమాచారం. ఈలోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు ఏపీ సీఎం. ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన గతంలో వెళ్లడించిన విషయం తెలిసిందే..! అందుకు తగ్గట్టుగానే బాబు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీ రాజకీయాల్లో గుణాత్మక మార్పు..! అభ్యర్థులను ముందుగానే ప్రకటించనున్న బాబు..!!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం నెలరోజుల ముందు నుంచే కసరత్తులు ప్రారంభించారు. పార్టీ అంతర్గత సర్వేలు, గూఢచారి నివేదికలు, స్వతంత్ర సంస్థల సర్వేల ద్వారా రప్పించుకున్న నివేదికల ఆధారంగా ముఖ్యమంత్రి అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించారు. అన్ని నివేదికలను క్రోడీకరించి ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చేశారని తెలిసింది. కొన్ని సర్వేలపై ముఖ్యమంత్రికి సందేహం వచ్చి 'క్రాస్ చెక్' చేసుకుంటున్నారట. రాజధాని పొరుగు జిల్లాలలో ఒక ఎమ్మెల్యేపై సర్వే నివేదికలు భిన్నంగా వచ్చాయట.దీంతో పార్టీ సర్వేను పక్కనపెట్టిన ముఖ్యమంత్రి తనకు నమ్మకమైన స్వతంత్ర సంస్థ ద్వారా మరోసారి సర్వే చేయించి నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.
నువ్వు.. నేనూ.. మోడీని నమ్మి మోసపోయాం, కేసీఆర్తో చేతులు కలిపేందుకు సిద్ధం: బాబు
అభ్యర్థుల ఎంపికలో ముహూర్తాలు చూస్తున్న బాబు..! మంచి మూహూర్తంలోనే అభ్యర్థుల ప్రకటన..!!
ముఖ్యమంత్రి ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో సర్వే నివేదికలను పరిశీలించి అభ్యర్థుల అంశంలో తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ బ్యాక్ ఆఫీస్ నుంచి వచ్చిన నివేదికలతో పాటు, ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఎలాంటి ఇమేజ్ ఉంది ? శాసనసభ్యుల తీరుపై పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? నియోజకవర్గంలో మండలస్థాయి ద్వితీయశ్రేణి నేతలతో వారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ? అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా?. వంటి పలు అంశాలనూ సీఎం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ వడపోతల అనంతరం ముఖ్యమంత్రి 75 నుంచి 100 స్థానాలకు అభ్యర్ధులను త్వరలోనే ప్రకటిస్తారన్నది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోన్న సమాచారం.
బాబు నిర్ణయంతో టెన్షన్ పడుతున్న ఆశావహులు..! ఎవరికి అవకాశం ఉంటుందో నని ఉత్కంఠ..!!
ఇక జనవరి 17 తరవాత ఓ మంచి ముహూర్తాన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ అందరికన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించారు. తద్వారా అసంతృప్తులను బుజ్జగించడానికీ, అవసరమైతే వారికి నచ్చజెప్పడానికీ సమయం దొరికింది. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి అసంతృప్తుల బెడద అంతగా లేదు. అందరి సహకారం ఉండటంతో అభ్యర్థుల గెలుపు సులువు అయింది. ఐతే ముందుగా పార్టీ టిక్కెట్లు ప్రకటిస్తే చాలదని, అభ్యర్థి క్యారెక్టర్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని చంద్రబాబు అభిప్రాయపడుతుండడం విషేశం..!
జనవరి 17తర్వాత ప్రకటన..! కేసీఆర్ ఫార్ములా ను నమ్ముతున్న బాబు..!!
ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తానని ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి ఇటీవల స్పష్టంచేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో కలవరం మొదలైనట్టుగా తెలుస్తోంది. మంచి ముహూర్తాలు ఉన్నందున ఈ నెలాఖరుకే తుది జాబితా వస్తుందని అందరూ భావించారు. కొత్త సంవత్సరంలోనే ప్రకటించవచ్చని మరికొందరు అనుకుంటున్నారు. అలా అయితే జనవరి 17 తరవాతే జాబితా విడుదల ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముహూర్తాలు, గ్రహాలు అంతగా పట్టించుకోని చంద్రబాబులో ఈ మార్పు ఏంటబ్బా అని ఆశావహులు ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తున్నారట..!!