అలా చేస్తే అరిష్టం: తిరుమల డిక్లరేషన్ అంశంపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: తిరుమల డిక్లరేషన్ అంశంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగిన క్రమంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అన్యమతస్థుడైన ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇస్తే తప్పేంటని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
తిరుమల డిక్లరేషన్పై సుబ్బారెడ్డి వ్యాఖ్యల వక్రీకరణ- చంద్రబాబు మీడియా పనే అన్న స్వామి
చిత్తూరు జిల్లా టిడిపి నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. జగన్ డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలని అన్నారు. అన్యమతస్థులు డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమల ఆలయంలో అడుగుపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టు వస్త్రాలిస్తే రాష్ట్రానికే అరిష్టమని వ్యాఖ్యానించారు. అలాగే అన్యమత ఆచారాలను కించపర్చకూడదని అన్నారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయాలని వైసీపీ చూస్తోందని మండిపడ్డారు. దీనిపై బుధవారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలపాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
అంతకుముందు టీడీపీ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రశాంతమైన రాష్ట్రంలో మత చిచ్చు రగిలిస్తున్నారని.. ఓటు బ్యాంక్ రాజకీయాలతో రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటు టోటు బ్యాంకు రాజకీయమే తప్ప ఏ మతంపైనా సీఎం జగన్మోహన్ రెడ్డికి విశ్వాసం లేదని ఆరోపించారు.
సీఎం ఏ మతస్థుడైన కావొచ్చని.. కానీ అన్ని మతాలను ఆయన సమదృష్టితో చూడాలని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని ప్రార్థనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు. ఇటీవల మంత్రులు చేసిన వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెట్టే దుస్థితి తెచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే తిరుమల డిక్లరేషన్, మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, టీడీపీ, జనసేనలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నానిపై పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు బీజేపీ నేతలు. జనసేన కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది.