వాళ్లు వెళ్లిపోవడమే మంచిది: ఆమంచి-అవంతిలపై బాబు, మరికొందరు కూడా పార్టీ మారవచ్చు!
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరారు. టీడీపీ అనుబంధ ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అధినేత జగన్ను కలిశారు. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. విశాఖ నుంచి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా జగన్ను కలుస్తున్నారు. మరో ఎంపీ రవీంద్రబాబు కూడా అదే ఆలోచనతో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తెలుగు తమ్ముళ్ల ఆందోళన
వరుసగా కీలక నేతలు టీడీపీని వీడటంపై ఆ పార్టీలో ఆందోళన కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఇలాంటి సమయంలో కడప నుంచి 2014లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి, చీరాల నుంచి గెలిచిన ఆమంచి ఇన్నాళ్లు టీడీపీతో ఉండి వైసీపీలో చేరడం, ఇప్పుడు మరో ఇద్దరు ఎంపీలు పార్టీని వీడటంపై తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టిడిపికి మరో ఎంపి గుడ్ బై..! : వైసిపి లో చేరేందుకు సిద్దం
వాళ్లు వెళ్లిపోతేనే మంచిది
ఎన్నికలు దగ్గరపడుతున్నందున పార్టీని వీడే వారి గురించి పెద్దగా పట్టించుకోకూడదని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఇవాళ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తదితర నేతలు పార్టీ వీడుతున్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కొందరు పోతే పార్టీకి నష్టాల కన్నా లాభాలేనని ఆయన కేడర్కు ధైర్యం చెప్పారు. అవకాశవాదులకు టీడీపీలో స్థానం లేదన్నారు. కార్యకర్తలే పార్టీని కాపాడుకుంటారన్నారు.
మరికొందరు కూడా పార్టీలు మారొచ్చు
ఎన్నికల సీజన్ కావడంతో కొందరు సొంత ప్రయోజనాల కోసం రానున్న రోజుల్లో కూడా పార్టీలు మారడం సహజమేననే టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్ విషయానికి కూడా అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదనే అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో పార్టీ బలంగా ఉందని, సార్వత్రిక ఎన్నికల్లో ఇవే తమను తిరిగి మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని అంటున్నారు.