రాజధానిలో చంద్రబాబు దిష్టి బొమ్మ దహనం... ఉద్రిక్తత .. ఆరోపణలు, ప్రత్యారోపణలు
రాజధానిలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతల నడుమ సాగుతోంది. మొదటి నుండి చంద్రబాబు అమరావతి పర్యటన విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో నేడు రాజధానిలో పర్యటిస్తున్న చంద్రబాబుకు అటు రైతుల నుండి వైసీపీ కార్యకర్తల నుండి నిరసన సెగ తగిలింది. వైసీపీ కార్యకర్తలతో పాటు రాజధానిలోని ఒక వర్గం రైతులు నల్లజెండాలతో చంద్రబాబు పర్యటనకు నిరసన తెలిపారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ బాబు పర్యటన కొనసాగుతుంది.
చంద్రబాబు అమరావతి పర్యటన లో టెన్షన్ ... వ్యతిరేకిస్తూ ఒక వర్గం , స్వాగతిస్తూ మరో వర్గం ఫ్లెక్సీలు
చంద్రబాబును అడ్డుకున్న రైతులు, వైసీపీ శ్రేణులు.. టీడీపీ శ్రేణులతో బాహాబాహీ
అమరావతిలో చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు ఒక వర్గం రైతులు , వైసీపీ కార్యకర్తలు . చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు విసిరారు. చెప్పులతో దాడి చేశారు. చంద్రబాబు అమరావతి పర్యటనను అడ్డుకునేందుకు అడుగడుగునా యత్నించారు.చంద్ర బాబు గోబ్యాక్ అంటూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టిడిపి నేతలు సైతం వైసీపీ నేతలతో బాహాబాహీకి దిగారు. అదే విధంగా చంద్రబాబు ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న రైతులపై కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం .. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
దీంతో పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలపుతున్న తమపై పచ్చపార్టీ శ్రేణులు గుండాల్లా దాడులు చేశారని వారు ఆరోపిస్తున్నారు. అన్నదాతలపై టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ రాజధాని ప్రాంతం రైతులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
రాజధాని కోసం భూములు తీసుకుని అన్యాయం చేశారని ఆగ్రహం
రాజధాని పేరుతో భూములు తీసుకుని తమకు ఎలాంటి న్యాయం చేయకుండా, ఇస్తానన్న హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు తమకు అన్యాయం చేశారని వారు మండిపడుతున్నారు. ఈ అన్యాయాన్ని నిలదీయడానికి వస్తే తమపై దాడి చేయించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చినందుకు ప్రతిఫలంగా చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో తమపై దాడి చేయించారని ఆవేదన చెందుతున్నారు. దీనికి చంద్రబాబుకు కచ్చితంగా బుద్ధిచెప్తామని చంద్రబాబు ను వ్యతిరేకిస్తున్న రైతులు హెచ్చరించారు.
బాబు రాజధాని పర్యటన అడ్డుకుంది రైతుల ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలు అని టీడీపీ ఫైర్
ఇక రాజధానిని పర్యటించడానికి వస్తే ఈ విధంగా దాడులకు పాల్పడటం మంచిది కాదని పేర్కొన్నారు. రాజధాని అంశాన్ని పట్టించుకోకుండా ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. టిడిపి నేతలు సైతం చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నించారని, చంద్రబాబు ను అడ్డుకోవడానికి వచ్చిన రైతులు, వైసిపి కార్యకర్తలని మండిపడుతున్నారు.మొత్తానికి రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు, నిరసనల నడుమ, టీడీపీ వైసీపీ కార్యకర్తల బాహాబాహి ల మధ్య చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు రాజధానిలో పర్యటిస్తున్నారు.