మా డాటా చోరీ చేసి మాకే ఫోన్లా?.. వాళ్ల ప్లాన్ తిప్పికొట్టాలన్న చంద్రబాబు
అమరావతి : టార్గెట్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వయా బీజేపీ, టీఆర్ఎస్. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుత మంత్రం. ఆ మూడు పార్టీలు కలిసి టీడీపీపై కుట్ర చేస్తున్నాయని మండిపడుతున్నారు. తాజాగా డాటా చోరీ కేసులో జగనే దోషి అంటూ విరుచుకుపడ్డారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. ఓటింగ్ కు సంబంధించి దిశానిర్దేశం చేశారు.
కి'లేడీ' బ్యాంకు ఉద్యోగి.. డిపాజిటర్ల రెండున్నర కోట్లు మాయం
మా డాటా చోరీ చేసి మాకే ఫోన్లా?
జగన్ మాయామంత్రాలు ఏపీలో చెల్లవని స్పష్టం చేశారు చంద్రబాబు. టీడీపీ డాటా దొంగిలించి.. వైసీపీకి ఓటు వేయాలంటూ ఫోన్లు చేయిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నుంచి ఎవరూ ఫోన్ చేసినా.. టీడీపీ కార్యకర్తలు దీటైన సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మా నెంబర్ మీకెలా దొరికిందంటూ గట్టిగా నిలదీయాలని సూచించారు. టీడీపీ డాటా ఎందుకు తస్కరించారంటూ వారిని ప్రశ్నించాలని కోరారు. దొంగలకు ఓట్లు వేయబోమని ధైర్యంగా చెప్పాలని సూచించారు.
టీడీపీ యాప్ పైనే దుష్ర్పచారం?
దేశవ్యాప్తంగా దాదాపు అన్నీ పార్టీలకు యాప్ లు ఉన్నాయని.. కేవలం టీడీపీ యాప్ పైనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ పై వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసికట్టుగా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ధైర్యంగా ఎదుర్కోలేక హైదరాబాద్లో కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక ఈ మూడు పార్టీల కుట్ర దాగి ఉందన్న చంద్రబాబు.. 13 లక్షల ఓట్లు తీసివేయించడానికి ప్లాన్ వేశారని మండిపడ్డారు. వైసీపీకి చెందిన 2వేల మంది 8 లక్షల దరఖాస్తులు పెట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 59 లక్షల ఓట్లు తొలగించే కుట్రలో జగన్మోహన్ రెడ్డియే ప్రధాన సూత్రధారని.. సకాలంలో తాము స్పందించి కుట్రను భగ్నం చేశామని చెప్పుకొచ్చారు.
పసుపు - కుంకుమ.. 3.5వేలు జమ
డ్వాక్రా మహిళలకు ఇవాళ మరో శుభదినంగా అభివర్ణించారు చంద్రబాబు. పసుపు - కుంకుమ పథకం కింద రెండో విడత ఇవాళ బ్యాంకుల్లో జమచేయనున్నట్లు చెప్పారు. ప్రతి మహిళకు చెందిన ఖాతాలో మూడున్నర వేల రూపాయలు జమ అవుతాయన్నారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళే బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేసినట్లు తెలిపారు. మరో కిస్తీ కింద 4 వేల రూపాయలు త్వరలో చెల్లిస్తామన్నారు.