ఖాళీ కాబోతున్న నగరం..! లక్షల సంఖ్యలో గ్రామబాట పట్టనున్న ప్రజలు..!!
హైదరాబాద్: నగరం ఖాళీ ఆయ్యే సీజన్ వచ్చేసింది. ప్రతి యేడాది లాగే ఈసారి కూడా ప్రజలు పెద్ద యెత్తున నగరాన్ని ఖాళీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంఉన్నారు. అదేంటి నగరాన్ని ఖాళీ చేసేంతటి ఉవద్రవం ఏం ముంచికొచ్చిందని అనుకుంటున్నారా..? అదేనండి సంక్రాతి సీజన్ వచ్చేసింది కాబట్టి సొంత ఊళ్లకు వెళ్లేందుకు నగర ప్రజలు రెడి ఐపోతున్నరన్న మాట. ఈ సారి పండగతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండడంతో అటు ఆంద్రతో పాటు ఇటు తెలంగాణ పల్లెలకు జనం పెద్ద యెత్తున తరలివెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఏపీలో సంక్రాంతి ప్రత్యేక పండుగ..! పెద్ద సంఖ్యలో జనం ఊరి బాట..!!
సంక్రాంతి రద్దీ మొదలవుతోంది. సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఈసారి హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు దాదాపుగా 30 లక్షల మందికి పైగా సొంతూళ్లకు వెళ్తారని అంచనా. హైదరాబాద్లో స్థిరపడ్డ ఆంధ్రా ప్రజలు సంక్రాంతికి తప్పకుండా స్వగ్రామాలకు వెళ్తారు. నగరం విస్తరిస్తోన్న సందర్బంగా వీరి సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తోంది. దీంతో సొంతూళ్లకు వెళ్లడం ఓ ప్రహసనంగా మారింది.
నిర్మానుష్యం కానున్న నగర రోడ్లు..! ఊపిరి పీల్చుకోనున్న ట్రాఫిక్ పోలీసులు..!!
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ స్థిరపడ్డ ప్రజలు సంక్రాంతికి తప్పకుండా వెళతారు. ఇలాంటి వెళ్లే వారి సంఖ్య దాదాపు 20 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం. దీంతో ఏపీకి వెళ్లాల్సిన ప్రత్యేక బస్సులు, రైళ్లపై అపుడే చర్చ మొదలైంది. ముందస్తుగా రైళ్లల్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి అదనపు ఛార్జీలు గండం తప్పినా.. అలాంటివారు చాలా తక్కువ. ఏపీ నుంచి వచ్చి నగరంలో స్ధిరపడిన వారిలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి వారంతా జనవరి 7 తర్వాత ప్రయాణాలు ప్లాన్ చేస్తారు.
పంచాయితీ ఎన్నికల నేపథ్యతో పల్లెలకు తరలనున్న తెలంగాణ ప్రజలు..!!
పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఊరికి రావాలంటూ పిలుపులు వస్తున్నందున.. ఈసారి తెలంగాణ పల్లెలకూ ప్రయాణికులు పోటెత్తుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండటంతో సహజంగానే రద్దీ ఉంటుంది. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్క నగరం నుంచే దాదాపుగా 10 లక్షల మందికిపైగా తెలంగాణ ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతికి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
రవాణా వ్యవప్థకు ఇదే మంచి అదును..! అందినంతా దోచుకోవచ్చు..!!
హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా సంస్థలే కీలకం. అయితే.. పండుగల సమయంలో ఉండే రద్దీని నియంత్రించడం సాధ్యంకాకపోవడంతో.. ఈ వ్యవస్థలు అదనపు చార్జీల రూపంలో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇది సామాన్యుడిని ఆవేదనకు గురిచేస్తోంది. రైలు, బస్సుల టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పండుగపూట సొంతూరికి వెళ్లే ప్రయాణం ఎంతో ఖర్చుతో కూడుకున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సగటు ప్రయాణికుడు.