ఆ బస్సులు ఒక్కసారి వాడి చూస్తే తెలుస్తుంది...ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో శాఖపరమైన పనితీరుకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలకు సిఎం చంద్రబాబు గ్రేడ్లు కేటాయించారు. ఉండవల్లిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ గ్రేడుల కేటాయింపు చేశారు. ఈ ర్యాంకులలో 150.2 శాతం ఫలితాలతో జలవనరుల శాఖ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిసింది.
ఇదిలావుంటే ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల వినియోగంపై సురేంద్రబాబు ఆసక్తి చూపకపోవడాన్ని కలెక్టర్ల సమావేశం సందర్భంగా సిఎం చంద్రబాబు తప్పుబట్టారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను వినియోగం వల్ల ఇబ్బందులు ఉంటాయన్న సురేంద్రబాబు వాదనతో ముఖ్యమంత్రి చంద్రబాబు విభేదించారు. ఒక్కసారి వాడిచూస్తే తెలుస్తుందని ఆయనకు సూచించారు. వివరాల్లోకి వెళితే...
అమరావతి ప్రజావేదికలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కలెక్టర్ల సమావేశంలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ అతి తక్కువ ద్రవ్యోల్భణంతో ఆంధ్రప్రదేశ్ కు దేశంలోనే రెండో స్థానం లభించిందని చెప్పారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టామని, అనుకున్నవిధంగా లక్ష్యాన్ని సాధించి తీరుతామని సిఎం చంద్రబాబు చెప్పారు. అయితే ఈ సంద్భంగా ఆర్టీసీ ఎండి సురేంద్రబాబుపై సిఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల వినియోగంపై ఆ సంస్థ ఎండీ సురేంద్రబాబు అంతగా ఆసక్తి చూపకపోవడం కలెక్టర్ల సమావేశం సందర్భంగా సిఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో ఆర్టీసీ ఎండా సురేంద్రబాబు తీరును సీఎం తప్పుబట్టినట్లు తెలిసింది. అయితే ఈ విషయమై సురేంద్రబాబు వాదిస్తూ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వాడటం వల్ల ప్రాక్టికల్ గా కొన్ని ఇబ్బందులు ఉంటాయని సిఎం చంద్రబాబుకు వివరించే ప్రయత్నం చేశారు.
అయితే సురేంద్రబాబు వాదనతో విభేదించిన సీఎం చంద్రబాబు ఒకసారి విద్యుత్ శాఖలో పనిచేస్తే ఎలక్ట్రికల్ బస్సుల వినియోగంపై మీరే ఆసక్తి చూపుతారని...అయినా వాడిచూస్తే కదా ఆ బస్సుల ప్రయోజనాలు తెలిసేది అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. నూతన టెక్నాలజీ లను అందిపుచ్చుకునే విషయంలో అధికారులు ముందుండాలని సీఎం ఈ సందర్భంగా సూచించారని సమాచారం.
ఇదిలావుంటే పరిపాలన, రాజకీయం రెండూ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందంటూ సిఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం తాను పొలిటికల్ గవర్నెన్స్ దిశగా ముందుకెళ్తున్నట్లు వెళ్లడించిన సిఎం చంద్రబాబు దేశ రాజకీయాలు రాష్ట్రం మీద ఎంతో ప్రభావం చూపుతాయని...దేశం బావుంటే రాష్ట్రం కూడా బావుంటుందని అధికారులకు వివరించారు.
అనంతరం సిఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలకు పనితీరు ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు. ఆ గ్రేడుల వివరాలు ఇవీ...ఎ-కేటగిరి: జలవనరుల శాఖ, వ్యవసాయ, సహకారశాఖ, ఉద్యానం,పట్టు పురుగుల శాఖ, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, పర్యావరణం, అటవీ శాఖ, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ, కార్మిక, ఉపాధి కల్పన శాఖ, మహిళ, శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ, పశు సంవర్ధక, మత్స్య శాఖలు, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ.
బి-కేటగిరి: పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, విద్య, గృహ నిర్మాణం, ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి, మైనారిటీల సంక్షేమ శాఖలు...సి-కేటగిరి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, డి-కేటగిరి: క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ, 150.2 శాతం ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచిన జల వనరుల శాఖ. జిల్లాల వారీగా పనితీరు చూస్తే ఎ-కేటగిరిలో తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు, పశ్చిమ గోదావరి, కడప జిల్లాలు ఉన్నాయి.