ఏపీలో మరో సారి కేసీఆర్ లోల్లి..!! తెలంగాణ సీఎం పేరెత్తితే భయపడుతున్నారా.. ఎవరు.. ఎందుకు ?
అమరావతి : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరు మరోసారి ఆంధ్రప్రదేశ్లో వినిపించింది. ఇదివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆయన పేరు ప్రస్తావించారు. తాజాగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ టీడీపీ సభ్యులను ఇరుకున పెట్టే విధంగా కేసీఆర్ పేరు వాడారు. ఆయన పేరు ఎత్తితే టీడీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని చురకలు అంటించారు.
ఏపీలో కేసీఆర్ ప్రస్తావన మరోసారి.. టీడీపీ సభ్యులకు భయం..!
ఏపీలో మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావన వచ్చింది. మంగళవారం నాడు శాసనమండలిలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2 లక్షల 32 వేల కోట్ల రూపాయలతో ద్రవ్య వినిమయ బిల్లు ప్రతిపాదించారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఆ క్రమంలో సదరు బిల్లుపై చర్చ జరిగిన సందర్భంగా టీడీపీ సభ్యులు లెవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లోని భావితరాల ప్రయోజనాల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు బుగ్గన. ఆ క్రమంలో శ్రీశైలం, నాగార్జున సాగర్కు గోదావరి జలాలను తరలించాలనే విషయంలో కేసీఆర్, జగన్ చర్చలు జరిపారని.. తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను తరలిస్తే అవి మనకు వస్తాయా అనే రీతిలో టీడీపీ సభ్యులు అనుమానించాల్సిన అవసరం లేదన్నారు. అదలావుంటే అసలు కేసీఆర్ పేరెత్తితేనే టీడీపీ సభ్యులు ఎందుకు వణికిపోతున్నారో అర్థం కావడంలేదన్నారు.
చైన్ మార్కెటింగ్లో లక్షలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. "క్యూనెట్" మోసాల కథేంటో తెలుసా?
టీడీపీ సభ్యులకు బుగ్గన చురకలు
వైసీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావడం లేదని.. కేవలం వంద రోజులు మాత్రమే పూర్తి చేసుకుందని గుర్తు చేశారు బుగ్గన. అలాంటి నేపథ్యంలో పోలవరం పనులు నెమ్మదించాయని టీడీపీ సభ్యులు ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో 3వేల కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. 1700 కోట్ల రూపాయలతో కాలువలు తవ్వించారని చెప్పుకొచ్చారు. ఇవాళ అవే గనక పూర్తి కాకుంటే పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఎలా వచ్చేవని ప్రశ్నించారు.
టీడీపీ ప్రభుత్వానికి అన్నీ అవినీతి మరకలే : బుగ్గన
గత టీడీపీ ప్రభుత్వంలో అన్నీ అవినీతి అక్రమాలే జరిగాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 2014 నుండి 2016 వరకు పోలవరంప్రాజెక్టు మాటే ఎత్తలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఒప్పందం కుదిరే వరకు వాటి గురించి పట్టించుకోక పోవడానికి కారణాలు అందరికి తెలుసన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం మొదలు పోలవరం ప్రాజెక్టు, నీరు-చెట్టు కార్యక్రమంలోనూ అవినీతి జరిగిందన్నారు. అసలు అవినీతి జరగనిది ఎక్కడో చెప్పాలని టీడీపీ సభ్యులకు చురకలంటించారు. అయితే ఆ అవినీతి తాలూకు పనులను సమీక్షిస్తామని చెప్పుకొచ్చారు.
టిక్టాక్లో కొత్త పైత్యం.... కుక్కలా ఎక్స్ప్రెషన్స్.... చూస్తే భయమే....!
ఏపీ అసెంబ్లీలో పదేపదే కేసీఆర్ నామస్మరణ..!
అదలావుంటే ఏపీ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే ప్రస్తావించడం చర్చానీయాంశమైంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరాక జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ను కొనియాడారు. తాజాగా ఈనెల 25వ తేదీన జరిగిన సమావేశాల్లోనూ మరోసారి ఆయన గురించి ప్రస్తావించారు జగన్. ఎగువ రాష్ట్రాన్ని నమ్ముకుంటే నష్టపోతామని.. తెలంగాణతో స్నేహ బంధం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మీద నాకేమీ ప్రేమ ఉండకపోవచ్చు.. కానీ ఆయన మంచి మనిషని కితాబిచ్చారు. నీటి ప్రాజెక్టుల గురించి చర్చ జరిగిన సందర్భంగా టీడీపీ సభ్యులు పలు ప్రశ్నలు లెవనెత్తగా.. జగన్ దీటుగా సమాధానం ఇచ్చారు. ఆ క్రమంలో మరోసారి కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు.