గుడ్ న్యూస్: వారికి కారుణ్య నియామకాలు, సీఎం జగన్ ఆదేశాలు
ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీచేశారు. వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ స్పష్టంచేశారు. వైద్య, ఆరోగ్య శాఖపై సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. కోవిడ్-19 నియంత్రణ, నివారణా చర్యలు, వ్యాక్సినేషన్పై సమీక్ష జరిపారు.
జాతీయ ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, జిల్లా ప్రధాన కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్ హబ్స్ ఏర్పాటుపై జగన్ డిస్కష్ చేశారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకంపై చర్చించారు.
వివిధ ఆస్పత్రుల్లో గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు నియామకాల క్యాలెండర్ను రూపొందించామని జగన్కు అధికారులు వివరించారు. అక్టోబరు 20న పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీచేస్తామని వారు తెలిపారు. డీపీహెచ్ఎఫ్డబ్ల్యూలో పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 20న నోటిఫికేషన్ ఇస్తామని, ఎంపిక ప్రక్రియను పూర్తిచేసుకుని డిసెంబర్ 10న నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు వెల్లడించారు.
డీఎంఈలో పోస్టులకు సంబంధించి అక్టోబరు 20న నోటిఫికేషన్ జారీచేస్తామని, ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి డిసెంబర్ 5న నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు తెలిపారు. ఏపీవీవీపీలో పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 20 నుంచి 23 వరకూ నోటిఫికేషన్లు జారీ చేస్తామని, ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి డిసెంబర్ 21 -25 మధ్య నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. నియామకాలపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.