సంచలనం:చంద్రబాబు ఆస్తులపై ఆర్ఓసీకి న్యాయవాది ఫిర్యాదు;ఫోరెన్సిక్ ఆడిట్ కోసం రిక్వెస్ట్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఆయన కుటుంబ ఆస్తులపై మరోసారి ఫిర్యాదు దాఖలైంది. రామారావు అనే న్యాయవాది రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్ఓసీ)కు ఈ ఫిర్యాదును చేశారు.
చంద్రబాబు కుటుంబ ఆస్తులు, ఆయనకు సంబంధించిన కంపెనీల ఆదాయంపై విచారణ జరపాలని కోరడంతో పాటు ఆయన కుటుంబ ఆస్తులు అమాంతం ఒక్కసారిగా పెరగడంపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ద్వారా దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. ఇదిలావుంటే ఈ ఫిర్యాదును స్వీకరించిన ఆర్ఓసీ తదుపరి చర్యలకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.
చంద్రబాబు ఆస్తులపై ఫిర్యాదు చేసిన వారి జాబితాలో తాజాగా మరో న్యాయవాది చేరారు. గతంలో లక్ష్మీపార్వతి, విజయమ్మ, తెలంగాణా జూనియర్ న్యాయవాదులు, శ్రావణ్ కుమార్ అనే న్యాయవాది చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరుతూ ఫిర్యాదులు చేయగా తాజాగా రామారావు అనే న్యాయవాది చంద్రబాబు, ఆయన కుటుంబం ఆస్తులపై విచారణ కోరుతూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫ్రెష్కు చెందిన 14 కంపెనీల్లో అవకతవకలు జరిగాయని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అవినీతి, అక్రమ వ్యవహారాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ద్వారా దర్యాప్తు జరిపించాలని రామారావు కోరారు. అయితే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఈ తరుణంలో ఫిర్యాదు దాఖలు కావడం తెలుగు రాష్ట్రాలో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలావుంటే దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు అని ఇటీవలే అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆస్తులు రూ. 177 కోట్లుగా ఏడీఆర్ వెల్లడించింది. అయితే ప్రతి ఏటా ఆస్తులు ప్రకటించే క్రమాన్ని పాటిస్తున్న క్రమంలో చంద్రబాబు కుమారుడు లోకేష్ గత ఏడాది కూడా తమ ఆస్తుల వివరాలు ప్రకటించగా అందులో చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులు రూ.34 లక్షలు మాత్రమేనని పేర్కొనడం గమనార్హం.
ఇక తనకు రూ. 25.25 కోట్లు, బ్రాహ్మణి ఆస్తి రూ. 25 కోట్లు, తల్లి భువనేశ్వరి పేరుతో రూ. 25 కోట్ల ఆస్తులున్నట్టు లోకేష్ ఆ సందర్భంలో ప్రకటించారు. అంతేకాదు తన కుమారుడు దేవాన్ష్ పేరుతో రూ. 11.54 కోట్ల ఆస్తులున్నట్లు లోకేష్ తెలిపారు.