అమరావతిపై సీక్రెట్ బ్యాలెట్ ? - ఉద్యోగులు, రైతుల వార్ మధ్య ట్విస్ట్- సీపీఐ డిమాండ్...
ఏపీలో రాజధాని తరలింపు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఇప్పటికే అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన రాజధాని బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగా.. ఇదే అంశంపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ కేసుల్లో సచివాలయ ఉద్యోగులను ప్రస్తావించిన రైతులు మరింత అగ్గి రాజేశారు. దీంతో ఇప్పుడు రైతుల వ్యవహారాన్ని కోర్టుల్లోనే తేల్చాలని భావిస్తున్న ఉద్యోగులు వారి పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా ఓ ఎత్తయితే రాజధాని వ్యవహారంలో రైతుల వైఖరిపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు.. అమీతుమీకి సిద్ధమవుతున్నాయి.
మరోవైపు రాజధాని వ్యవహారంలో సచివాలయ ఉద్యోగుల తీరును తీవ్రంగా నిరసిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి, వారికి అండగా నిలుస్తున్న సీపీఐ ఇదే అదనుగా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాయి. అమరావతిపై ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు రహస్య బ్యాలెట్ నిర్వహించాలనే డిమాండ్ ను సీపీఐ తెరపైకి తెచ్చింది. రాజధాని తరలింపుపై ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సీక్రెట్ బ్యాలెట్ కు సిద్దం కావాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
Recommended Video
దీంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. రాజధాని తరలింపును వ్యతిరేకించడం లేదని ఉద్యోగులు తాజాగా వేసిన ఇంప్లీడ్ పిటిషన్ లో పేర్కొనడాన్ని సీపీఐ రామకృష్ణ తప్పుబట్టారు. రాజధానిలో 70 శాతం పనులు పూర్తి కావడం అవాస్తవమని ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి హైకోర్టులో వేసిన ఇంప్లీడ్ పిటిషన్ లో పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. వెంకట్రామిరెడ్డిని జగన్ ఇచ్చిన కళ్ల గంతలను కట్టుకున్న ధృతరాష్ట్రుడిగా రామకృష్ణ పేర్కొన్నారు.