తుఫాన్గా మారనున్న తీవ్ర అల్పపీడనం : కోస్తాకు గండం!
ఏపికి మరో తుఫాను పొంచి ఉంది. ఈ రోజు నుండి కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం అగ్నేయ బంగాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం తీవ్ర వాయుగుండంగా మారి వచ్చే ఒకటి రెండు రోజుల్లో మూడు జిల్లాల పై ప్రభావం చేపే అవకాశం ఉంది. దీంతో...ఈ మూడు జిల్లాలో ముందస్తు చర్యల పై ఏపి ప్రభుత్వం దృష్టి సారించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడి 15న దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు దిశగా రానుంది. ఇది తీరం వైపు వచ్చే సమయంలో దక్షిణ కోస్తాలో బలమైన గాలులతో పాటు అలలు ఎగసిపడే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాయుగుండం ప్రభావంతో ఈనెల 14నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయి. 15, 16 తేదీల్లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. కాగా, ఈనెల 14నుంచి 16వరకు కోస్తా జిల్లాలపై వాయుగుండం ప్రభావం చూపుతుందని ఆర్టీజీఎస్ విభాగం హెచ్చరించింది.
కోస్తాంధ్ర తీరానికి వాయుగుండం ముప్పు పొంచి ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని, కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో రైతులకు అండగా నిలవాలని సూచించారు. మూడు జిల్లాల్లోనూ మంత్రులు..అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీయం ఆదేశించారు.