టార్గెట్ లోకేష్ ..!? : మంత్రులు..అధికారులకు నోటీసులు : డేటా చోరీ కేసుల్లో కొత్త ట్విస్ట్..!
ఏపి డేటా చోరీ కేసులో కొత్త ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఏపిలో డేటా చోరీ జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుల పై విచారణ చేస్తున్న సైబరాబాద్ పోలీసులు చేస్తున్న వ్యాఖ్యలు..వేస్తున్న అడుగులు చూస్తుంటే ఇది ఏపిలోని కీలక మంత్రి ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ వ్యాఖ్యల పరమార్ధం కూడా ఇదే అనే చర్చ సాగు తోంది. ఏం జరిగింది...ఏం జరగబోతోంది..
ఏపి ప్రభుత్వ పాత్ర పై అనుమానాలు
ఏపికి సంబంధించిన డేటా ఓ ఐటి కంపెనీ వద్ద ఉండటం పై పిర్యాదు నమోదైంది. దీని పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసారు. అందులో ఐటి గ్రిడ్స్ వద్ద ఏపి సమాచారం ఉండటం పై పోలీసులు విచారణ ప్రారంభించారు.అయితే, ఇప్పుడు ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏపిలోని అధికార -విపక్షాల మధ్య పొలిటికల్ వార్ కు కారణమైంది. తమ పార్టీ కి సంబంధించిన డేటాను వైసిపికి అందించేందుకే టిఆర్యస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నా రు. ఇదే సమయంలో ఏపి ముఖ్యమంత్రి సైతం కీలక వ్యాఖ్యలు చేసారు. తమ డేటా విషయంలో ఏం చేయాలో తమకు తెలుసని..తమ పై ఒక కేసు పెడితే..తాము నాలుగు కేసులు పెడతామని హెచ్చిరించారు. ఇదే సమయంలో సైబరాబాద్ కమిషనర్ చేసిన వ్మాఖ్యలతో ఏపిలో ఈ వ్యవహారం లో చర్చలు సాగుతున్నాయి.
లోకేష్ ను లక్ష్యంగా చేసుకుంటారా..
ఈ వ్యవహారం మొత్తంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ చేసిన వ్యాఖ్యలతో లోతుగా పరిశీలిస్తే మంత్రి లోకేష్ చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఐటీ గ్రిడ్స్ డాటా స్కామ్ వెనుక ఎవరు ఉన్న కఠిన చర్యలు తప్పవని కమిష నర్ సజ్జనార్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో అవసరమనుకుంటే అక్కడి మంత్రులు..అధికారులకు నోటీసులు ఇస్తా మని స్పష్టం చేసారు. కేసును అడ్డుకోవటానికే ఏపి పోలీసులు కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేసారు. ఐటి గ్రిడ్స్ వద్ద కు ఈ సమాచారం ఎలా వచ్చిందనే దాని పై నే సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. అదే విధంగా క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగించారనే అంశం పైనా కూపీ లాగుతున్నారు. ఇప్పటికే అమెజాన్ క్లౌడ్ ద్వారా దీనిని అనుసంధానం చేసారని.. ఆ సంస్థకు నోటీసులు ఇచ్చామని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. అయితే, అసలు ఈ డేటా ఏపి ప్రభుత్వంలో ఎవరి ద్వారా వచ్చింది..దీనికి ఎవరు బాధ్యులనే అంశం పై దృష్టి సారించారు.
ఓట్ల తొలిగింపు దరఖాస్తుల పై విచారణ..
ఇదే సమయంలో ఈ డేటా ఆధారంగా ఓట్ల తొలిగింపు కోసం ఫార్ 7 వేల సంఖ్యలో దరఖాస్తు చేసారని అనుమానిస్తు న్నారు. టిడిపి ఓట్ల తొలిగింపుకు కుట్ర చేస్తుందని వైసిపి..వైసిపి నేతలే 8 లక్షల ఓట్లు తీసేసే కుట్ర చేస్తున్నారని ఏపి మఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. అయితే, ఎటువంటి విచారణ లేకుండా ఓట్ల తొలిగింపు సాధ్యం కాదని..ఒక్క ఓటు కూ డా తొలిగించమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదా స్పష్టం చేసారు. అయితే, రాజకీయంగా సాగుతున్నీ ఈ కేసు లో ఏపి లో ఎవరికి నోటీసులు ఇస్తారు..ఎవరిని ఇందులో చేర్చుతారనే దాని పై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఈ రోజు లేదా రేపు కేసులో కీలక పురోగతి ఉంటుందని చెబుతున్నారు. ఏపిలోని మంత్రులెవరికైనా నోటీసులు ఇస్తే ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం మరింత వేడి పుట్టించటం ఖాయంగా కనిపిస్తోంది.