బాబుకు మోడీ షాక్: టీడీపీలో తర్జన భర్జన..గట్టెక్కేదెలా..?
మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలు నేరుగా తమ ఖాతాలోకి వేస్తామని తెలిపింది. ఇక రైతు బంధు పథకం కింద ఇప్పటికే కేసీఆర్ రైతులకు ఎకరాకు రూ.8వేలు ఇస్తున్నారు. ఎన్నికలకు వెళుతున్న ఏపీ ప్రభుత్వం పై కూడా అక్కడి రైతులకు ఎకరాకు ఇంత డబ్బులు ఇవ్వాలనే ఒత్తిడి వస్తోంది. ఇక దీనిపై చంద్రబాబు సర్కార్ ఎలా వ్యవహరిస్తుంది..? ఈ ఒత్తిడిని ఎలా అధిగమిస్తుంది... రైతులకు డబ్బులు ఇస్తారా.. మరి అధికారంలోకి రావాలంటే రైతులపట్ల బాబు వైఖరి ఎలా ఉండనుంది... తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పథకాలకు చంద్రబాబు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు..?
ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచాలని భావిస్తోంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే పలు పథకాలు ప్రకటించింది. నిరుద్యోగ యువతకు రూ.1000గా ఉన్న నిరుద్యోగ భృతిని రూ.2వేలు చేస్తామని ప్రకటించింది. ఇక పసుపు కుంకుమ పేరుతో ఆడపడుచులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామని వెల్లడించింది. అయితే పసుపు కుంకుమ పథకం అమలు చేయాలంటే రూ. 9400 కోట్లు అవసరమవుతుంది. మరి ఇప్పటికే డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు సర్కార్ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా సమకూరుస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక నిరుద్యోగ భృతికి దాదాపు రూ.1000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతుండగా ఈ హామీని ఎలా నెరవేరుస్తుందనేని ఆసక్తికర చర్చగా మారింది.
రైతులకు మోడీ ఇచ్చేదానికంటే ఎక్కువ డబ్బులు బాబు ఇస్తారా..?
ఇక తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన రైతు బంధు పథకంతో తిరిగి అధికారంలోకి రాగలిగారని ఏపీ ప్రభుత్వం నమ్ముతోంది. మరి రైతులు కూడా చంద్రబాబు తమకు ఏదైనా మేలు చేస్తారని ఆశిస్తున్నారు. మరి సీఎం చంద్రబాబు కూడా ఏపీ రైతులకు కొన్ని షరతుల కింద డబ్బులు ఇవ్వాలని భావిస్తున్నారు. ముందుగా రూ.2వేలు ఇవ్వాలని భావించారు. అయితే తెలంగాణలో కేసీఆర్ ఎకరానికి రూ. 8వేలు ఇస్తుండటంతో ఏపీ సర్కార్ ఇచ్చే రూ.2వేలు ఎందుకూ సరిపోవనే వాదన మంత్రులు చంద్రబాబు ముందు వినిపించినట్లు సమాచారం. ఇక రైతులకు ఎంత డబ్బులు ఇవ్వాలనేది రూ. 2వేల నుంచి ప్రారంభమై రూ. 5వేల వద్ద ఆగింది. అంటే రూ. 5వేలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మోడీ ప్రభుత్వం రైతులకు రూ. 6వేలు ప్రకటించింది. కేసీఆర్ మోడీ ప్రభుత్వం కంటే ఎక్కువే తెలంగాణ రైతాంగానికి డబ్బులు ఇస్తున్నారు. మరి చంద్రబాబు రూ. 5వేలతో సరిపెడతారా లేక రాజకీయంగా చిక్కులు అధిగమించేందుకు కేంద్రం ప్రకటించిన రూ. 6వేలు కంటే ఎక్కువగా ఇస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది.
రైతులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తారా..?
కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రూ.75వేల కోట్లు కేటాయించింది. అయితే రూ.6వేలు ఒకే సారి కాకుండా మూడు వాయిదాల పద్ధతిలో ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇప్పటికే డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఒకవేళ డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాయిదాల రూపంలో చెల్లిస్తారా లేక కేసీఆర్లా ఒకేసారి మొత్తాన్ని చెల్లిస్తారా అనేదానిపై కూడా చర్చ జరుగుతోంది. ఒకవేళ అలా కాకపోతే రైతులకు కూడా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తారా అనేదానిపైన కూడా సమాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో పూర్తి స్థాయిలో రైతు రుణ మాఫీ కాలేదు. ఇంకా పెండింగ్లోను రుణ మాఫీ కార్యక్రమం ఉంది. దీనిపై రైతులు ఇప్పటికే ఒక్కింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు హామీలతో తలలు పట్టుకుంటున్న అధికారులు
ఇప్పటికే చాలావరకు బిల్లులు చెల్లించలేదు ఏపీ సర్కారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం తప్ప చాలావరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మరి అన్ని వర్గాల వారికీ ఎన్నో హామీలు ఇస్తున్న చంద్రబాబు డబ్బులు ఎక్కడినుంచి తీసుకొస్తారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. చంద్రబాబు ఇస్తున్న హామీలకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రభుత్వాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా వారి పరిస్థితి తయారైంది. ఇక కేంద్రంతో సత్సంబంధాలు లేవు కాబట్టి కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి అలాంటి సమయంలో చంద్రబాబు రైతులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.