బదిలీ వేటు.. దుర్గ గుడి ఈవో ట్రాన్స్ఫర్.. వేలాడుతోన్న సస్పెన్షన్ కత్తి
విజయవాడ దుర్గగుడి ఈవో సురేష్ బాబుపై బదిలీ వేటు పడింది. అతనిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశముంది. నాలుగు రోజులపాటు దుర్గగుడిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రాథమిక నివేదిక ఆధారంగా 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏసీబీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు దిగింది.
గత రెండేళ్లుగా జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అభియోగాలు మోపుతూ మరో నివేదికను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరుడే ఈవో సురేష్ బాబు అని, ఆయన హయాంలోనే అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి.
అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోమని నిన్న మంత్రి పేర్నినాని స్పష్టంచేశారు. ఆ మరుసటి రోజే బదిలీ వేటు పడింది. అంతకుముందు దుర్గగుడిలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. జమ్మిదొడ్డిలోని ఆలయ పరిపాలన కార్యాలయంలో రైడ్స్ కొనసాగాయి. ఎస్టాబ్లిష్ మెంట్ విభాగంలో అధికారులు రికార్డుల పరిశీలించారు. వెండి రథంలోని 3 సింహాల మాయానికి సంబంధించి రిపోర్ట్ కోసం ఏసీబీ అధికారులు వచ్చారు.