ద్వివేది, శంకర్పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
ఏపీలో పంచాయతీ పోరుకు నోటిఫికేషన్ విడుదలైన టెన్షన్ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భీష్మించుకొని కూర్చొవడం.. అన్నీ అనుకున్నట్టు ఆయనకు అనుకూలంగా జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తర్వాత.. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టంచేయడంతో.. జగన్ సర్కార్కు ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. ఎస్ఈసీకి సహకరిస్తామనే సంకేతాలను ఇచ్చాయి.
ఇటు పంచాయతీరాజ్శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ బదిలీ అయ్యారని మంత్రి పెద్దిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ఈసీ ఏం బదిలీలు చేసుకున్నా..తాము పట్టించుకోమన్నారు. సింబల్ లేకపోయినా 90 శాతంపైగా సర్పంచులు తమ పార్టీ వారు గెలుస్తారనే ధీమా ఉందని పెద్దిరెడ్డి చెప్పారు. ఎస్ఈసీ అనుకున్నంత మాత్రాన ప్రజల్లో తమపై ఉన్న అభిప్రాయం మారదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ వార్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఎన్నికలకు నిమ్మగడ్డ వాయిదా వేయడంతో వివాదం చెలరేగింది. ఆయనను తప్పించడం.. కొత్త ఎస్ఈసీ నియమించడం కూడా జరిగిపోయింది. అయితే హైకోర్టు జోక్యంతో.. తిరిగి నిమ్మగడ్డ పదవీ చేపట్టారు. మార్చిలో ఆయన పదవీకాలం ముగియనుంది. అప్పటివరకు ఎన్నికలు నిర్వహించొద్దు అని జగన్ సర్కార్ భీష్మించుకొని కూర్చొంది. కానీ ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుబడుతున్నారు. దీంతో వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహణకు ఏపీ సిద్దమవుతోంది.