ఏపీలో మళ్లీ తెరపైకి సీపీఎస్ పోరు- జగన్ మాట నిలబెట్టుకుంటారా ?
ఏపీలో వైసీపీ ఎన్నికల హామీల్లో ఒకటైన సీపీఎస్ రద్దుపై మరోసారి ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్న నేపథ్యంలో సీపీఎస్ రద్దుపై ఏర్పాటు చేసిన ఠక్కర్ కమిటీ నివేదిక నానాటికీ ఆలస్యం అవుతుండటంపై ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. దీంతో ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేస్తామనే సీఎం హామీని అమలు చేస్తే వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని ఏపీ జేఏసీ చైర్మన్ చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జేఏసీ చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, సెక్రటరీ జనరల్ సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. సీఎం జగన్ తమ పాదయాత్రలో సిపిఎస్ ను రద్దు చేసే బాధ్యత మాదేనని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడు రోజుల్లోగా సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పారని వారు గుర్తుచేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటుచేసిన ఐదుగురు సభ్యుల కమిటీ, అధికారులతో మరో కమిటీ టక్కర్ నివేదికను పరిశీలించి సూచనలు చేయాలని కోరినా ఇప్పటివరకూ అందించలేదని ఉద్యోగసంఘాల నేతలు తెలిపారు. కాబట్టి రాష్ట్ర్ర ప్రభుత్వం దీనిపై వెంటనే తగు నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
రాష్ట్రంలో సిపిఎస్ అమలైన తేదీ సెప్టెంబర్ 1న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ్ అవర్ డిమానుస్ర్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దుకై ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు అందరూ కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.