తెలుగు రాష్ట్రాల్లోనూ లయ తప్పుతున్న ఎగ్జిట్ పోల్స్..! శృతి తప్పుతున్న అంచనా..!!
హైదరాబాద్/అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి దారుణంగా తయారయింది. ప్రధానంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజల నాడిని పట్టెకోవడం ఎవ్వరి తరం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే అంచనా ఫలితాలు కూడా బోక్కబోర్లా పడుతున్నాయి. ఆంధ్ర ఆక్టోపస్గా పేరొందిన లగడపాటి రాజగోపాల్ సర్వే గతేడాది తెలంగాణ ఎన్నికల్లో దారుణంగా ఫెయిలైంది. మహాకూటమి గెలుపు ఖాయమని చెప్పగా అందుకు విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీదే విజయమని లగడపాటి స్పష్టం చేస్తున్నారు. టీడీపీ 90 నుంచి 110 స్థానాలు దక్కించుకుంటుందని జోస్యం చెబుతున్నారు.
తెలుగు ప్రజల పల్స్ పట్టుకోవడం కష్టం..! తప్పుతున్న అందరి అంచనాలు..!!
ఇదిలా ఉండగా తెలంగాణలో టీఆర్ఎస్ అధిక లోక్సభ స్థానాలు 14 నుంచి 16 మధ్య గెలుచుకుంటుందని స్పష్టం చేశారు. గత అంచనాలు తప్పడంలో ఈసారి జాగ్రత్తగా, పకడ్బందీగా సర్వే చేసినట్లు చెప్పారు. కానీ ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జాతీయ మీడియా సంస్థలు వైసీపీదే అధికారం అని చెప్పాయి. ఇండియాటుడే-యాక్సిస్, సీపీఎస్ సర్వే, వీడీపీ అసోసియేట్స్, ఆరా సంస్థలు వైసీపీ అధికారం అని తేల్చాయి. ఎలైట్, లగడపాటి, ఐ.ఎన్.ఎస్.ఎస్ మాత్రం టీడీపీకే మెజార్టీ సీట్లు కట్టబెట్టాయి. మరి ఎవరి అంచనాలు నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో అని జనాలు అయోమయం వ్యక్తం చేస్తున్నారు.
నమ్మకం ఎందుకు కోల్పోతున్నట్లు..? రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారడమే కారణమా..!!
అందుకే ఎగ్జిట్పోల్స్ ఇంతలా నమ్మకం కోల్పోయి.. అంచనాలు తప్పడానికి కారణం ప్రధానంగా ఒక్కటే కనిపిస్తోంది. సర్వే జరుగుతున్న తీరులోనే లోపాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎవరో కొందర్ని సర్వే చేసి ఆ ఫలితాలు పూర్తి దేశానికి, రాష్ట్రానికి ఆపాదించడంతో.. ఎగ్జిట్పోల్స్ విఫలమవుతున్నాయి.
తక్కువ శాంపిల్స్ సేకరణ..! ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం..!!
ఉదాహరణకు లగడపాటి రాజగోపాల్ సర్వే తీసుకుంటే లక్షా 50 వేల మందిని 110 నుంచి 120 నియోజకర్గాల్లో సర్వే చేసినట్లు చెప్పారు. కానీ దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఏపీలో కేవలం లక్ష మందిని సర్వే చేయడం అంటే ఆ ఫలితం ఏ మేరకు నిజమవుతుందనే ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇక సుమారుగా 90కోట్ల మంది ఓటర్లు ఉన్న భారతదేశంలో లక్ష లేదా, 2 లక్షల మంది సర్వే చేసి ఫలితాలు ప్రకటించడం వల్ల కూడా ఎగ్జిట్పోల్స్ విఫలమవుతున్నాయి.
పార్టీలకు అనుకూలంగా సర్వేలు..! అందుకే పప్పులో కాలు..!!
అలాగే దక్షిణ భారతాన ఉన్న పరిస్థితి, ఉత్తరాన ఉండదు. ఇదే పరిస్థితి ఈశాన్యాన ఉండదు. అందుకే ఎగ్జిట్పోల్స్కు, వాస్తవ ఫలితాలకు బారీ తేడా కనిపిస్తోంది. ఇక చాలావరకు సర్వే సంస్థలు ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా సీట్ల లెక్కలు వేయడం పరిపాటిగా మారింది. ఇదొక సేఫ్ గేమ్గా మార్చుకుని ఫలితాలు ప్రకటిస్తున్నాయి. అందుకే వాస్తవ ఫలితాలతో పోల్చుకుంటే బోల్తా పడుతున్నాయి.