చంద్రబాబు ఇంటికి ప్రమాద హెచ్చరికలు, మరో 36 ఇళ్లకు కూడా.. వరదనీరు పోటెత్తడంతో..
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. కృష్ణానదికి వరద ప్రవాహం క్రమ క్రమంగా పెరుగుతోంది. తూర్పు, పశ్చిమ కెనాళ్లకు 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటిమట్టం చేరుకోగా, ఇన్ఫ్లో 6.66 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులు ఉంది. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
నీట మునిగిన ఇళ్లు..
లోతట్టు ప్రాంతాలు కృష్ణలంక, తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్లో ఇళ్లు నీటమునిగాయి. విజయవాడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంత బాధితులను తరలిస్తున్నారు. కంట్రోల్ రూము ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వెంకటపాలెం కరకట్ట లోపల వైపు ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటితోపాటు 36 భవనాలకు అధికారులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. వరద ముంపు నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారు.
అలర్ట్.. అలర్ట్...
వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. లంక గ్రామాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజల కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
బ్యారేజీ పరిశీలన..
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదీ వరద ఉదృతిని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పరిశీలించారు. వరద నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమయ్యిందని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారని పేర్కొన్నారు. వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని చెప్పారు. కానీ లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. మంత్రితో కలిసి బ్యారేజీని పరిశీలించిన వారిలో ఎమ్మెల్యే వసంత వెంటక కృష్ణ, సింహాద్రి రమేశ్ తదితరులు ఉన్నారు.