ఆ నలుగురికీ పద్మాభిషేకం ..
గణతంత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొన కేంద్రం ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా.. విభిన్న రంగాల్లో విశేష సేవలందించిన నలుగురు తెలుగు ప్రముఖులను పద్మశ్రీ పురస్కారం వరించింది. ప్రసిద్ధ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, రైతునేస్తం వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రీకి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. దేశవ్యాప్తంగా మొత్తం 94 మందికి కేంద్రం ఈ పురస్కారాలు ప్రకటించింది.
గేయ రచయిత సిరివెన్నెల కు పద్మశీ
సిరివెన్నెల సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న గేయ రచయిత ఆయన. తొలి సినిమా పాట తో మొదలైన ఆయన ప్రస్థానం అప్రతిహాతంగా సాగుతోంది. ఆయన పేరు తెలియన తెలుగు వారుండరు. చేంబోలు వేంకటయోగి, సుబ్బలక్ష్మి దంపతులకి ప్రథమ సంతానంగా 1955 మే 20న మధ్యప్రదేశ్లోని శివినిలో జన్మించారు సీతారామశాస్త్రి. అనకాపల్లిలో హైస్కూలు విద్యాభ్యాసం, కాకినాడ ఆదర్శ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న: ఆరెస్సెస్ నేత, కమ్యూనిస్ట్ కవికి కూడా అత్యున్నత పురస్కారం
విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్యకళాశాలలో చేరి ఒక యేడాది ఎమ్.బి.బి.ఎస్ చదివాక టెలిఫోన్స్ శాఖలో అసిస్టెంటుగా ఉద్యోగంలో చేరారు. కాకినాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆంధ్రా విశ్వవిద్యాలయం లో ఎమ్.ఎ చేశారు. అక్కడే పలువురు సాహితీవేత్తలతో ఆయనకి స్నేహం బలపడింది. భరణి అనే కలం పేరుతో పలు పత్రికల్లో కథలు, కవితలు రాశారు. 1985లో కె.విశ్వనాథ్ ‘సిరివెన్నెల' చిత్రంతో సీతారామశాస్త్రి గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. అలా తొలి చిత్రం పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆయన పాటలతో అర్థవంతమైన పదాలతో.. సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సాహిత్యాన్ని అందించారు. నేడు పద్మ పురస్కారానికి ఎంపికై కీర్తి గడించారు.
చెస్తో అడుగులు..నడిచివచ్చిన పద్మం
చిన్న వయసులోనే చదరంగంలో రాటు తేలింది. తండ్రి పర్యవేక్షణలో చదరంగం ఎత్తులు నేర్చుకుంది. చిన్న నాటి నుండి ఎన్నో టోర్నమెంట్లు లో గెలిచింది. అవార్డులు..రివార్డులు దక్కించుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన ద్రోణవ ల్లి హారిక.. చెస్ అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. పసి ప్రాయంలోనే చెస్ ఆడటం మొదలుపెట్టిన హారిక.. అండర్-9 జాతీయ ఛాంపియన్షిప్లో పతకం గెలవడంతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో మెరిసింది. 20 ఏళ్ల వయసులో గ్రాండ్మాస్టర్ అయిన హారిక.. ప్రతిష్టాత్మక మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో మూడు కాంస్యాలు సాధించింది. 2016లో మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ విజేతగా నిలిచింది. తెలుగు ప్రజల ముద్దు బిడ్డ అయిన ద్రోణవల్లి హారిక ను కేంద్రం పద్మశ్రీ కి ఎంపిక చేసింది.
ఘనతలు అతని సొంతం..వంద మ్యాచ్ల్లో..
ఫుట్బాల్ అభిమానుల్లో ఆ పేరు తెలియని వారుండరు. భారత ఫుట్బాల్లో మరే క్రీడాకారుడికీ సాధ్యం కాని ఘనత లందుకున్న ఆటగాడు సునీల్ ఛెత్రి. వంద అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడు ఛెత్రినే. ఎక్కువ మ్యాచ్లు ఆడటమే కాదు.. ఏకంగా 67 గోల్స్ కూడా సాధించాడు. ప్రస్తుతం ఫుట్బాల్లో కొనసాగుతున్న క్రీడాకారుల్లో క్రిస్టియానో రొనాల్డో (85 గోల్్్స) తర్వాతి స్థానం అతడిదే. ఇటీవలే మెస్సి (65)ను అతను అధిగమించాడు. కెప్టెన్గా, జట్టులో కీలక ఆటగాడిగా ఎన్నో ఏళ్లుగా భారత ఫుట్బాల్కు పర్యాయ పదంలా నిలుస్తున్న ఛెత్రి తన ఆట తో దేశానికి ఎన్నో విజయాలందించాడు. తల్లి తండ్రుల ఉద్యోగ రీత్యా ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు.
రైతు నేస్తం గా గుర్తింపు..పద్మశ్రీతో గౌరవం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న మరో ప్రముఖుడు యడ్లపల్లి రైతునేస్తం వెంకటేశ్వర రావు. ఆయన రైతునేస్తం గా తెలుగు రాష్ట్రాల రైతాంగానికి సుపరిచితులు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల దిగుబడికి ఆయన చేస్తోన్న నిరంతర కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నేపాడులో 1968లో జన్మించారు. రైతు కుటుం బంలో పుట్టి, వ్యవసాయం చేస్తూ పెరిగిన వెంకటేశ్వరరావు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. రైతునేస్తం ఫౌండే షన్ స్థాపించారు. 12 ఏళ్లుగా ఆదే పేరుతో వ్యవసాయ మాసపత్రిక నడుపుతున్నారు. ఈ క్రమంలో పశునేస్తం, ప్రకృతి నేస్తం పత్రికలు ప్రారంభించి రైతులకు చేరువయ్యారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా.ఐవీ సుబ్బారావు పేరుతో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన వారిని ఏటా రైతునేస్తం పురస్కారాల తో గౌరవిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఆయన్ను పద్మశ్రీ తో గౌరవించింది.