ఎవరైనా రానీయండి.. నాకు చెప్తారు: జగన్ని జూ.ఎన్టీఆర్ మామ, నాగార్జున కలవడంపై గల్లా ఆసక్తికరం
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస్ రావు, తాజాగా, టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునలు కలవడంపై తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. వీరిద్దరు వైసీపీ అధినేతను కలవడం చర్చనీయాంశంగా మారింది.
తనపై నార్నె శ్రీనివాస రావు పోటీ చేస్తారనడంపై గల్లా
జూ.ఎన్టీఆర్ మామ నార్నె సంస్థల అధినేత నార్నె శ్రీనివాస రావు జగన్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన వైసీపీలో చేరుతారని, గుంటూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. దీనిపై గల్లా స్పందించారు. వైసీపీ తరపున మీపై నార్నె శ్రీనివాసరావు పోటీ చేస్తారని చెబుతున్నారని మీడియా అడగ్గా.. ఎవరినైనా రానీయండని, తాను మొదటిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేశానని, తనకు అది విన్నింగ్ సీటు, విన్నింగ్ ప్లేస్ అన్నారు. గుంటూరు అంటే తన మామగారి ఊరు అని, కాబట్టి ఇక్కడికి వచ్చానని, ఎన్నికలు ఎక్కడైనా కష్టంగానే ఉంటాయని, ముందు నుంచి కష్టపడితేనే గెలుస్తామన్నారు.
జగన్ను ఎందుకు కలిశానంటే: అసలు విషయం చెప్పిన నాగార్జున
నాగార్జున పోటీ చేస్తే నన్ను అడుగుతారు
నాగార్జున కూడా జగన్ను కలవడంపై గల్లా జయదేవ్ స్పందించారు. నాగార్జున తనకు మంచి స్నేహితుడని చెప్పారు. జగన్ను కలిసినంత మాత్రాన ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు కాదని అన్నారు. నాగార్జున రాజకీయాల్లోకి వస్తారని తాను అనుకోవడం లేదని, ఒకవేళ ఆయన గుంటూరు నుంచి పోటీ చేస్తే తనను సంప్రదిస్తారని తెలిపారు. గల్లా చెప్పినట్లుగానే.. నాగార్జున తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని తేల్చేశారు. రాజకీయాల్లోకి వచ్చినా తనకు చెబుతారని అన్నారు. జగన్ను ఎందుకు కలిశారో తనకు తెలియదన్నారు.
రాజకీయాల్లో సహజమే
వైసీపీలో చేరిన ఎంపీ రవీంద్రబాబు తనపై విమర్శలు చేయడంపై గల్లా స్పందించారు. స్నేహితుడిగా ఉన్న ఆయన, తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియదన్నారు. రవీంద్రబాబు అంటే ఇప్పటికీ తనకు గౌరవమే అన్నారు. టీడీపీలో గెలిచే వారికే చంద్రబాబు టికెట్లు ఇస్తారని చెప్పారు. గెలవలేం అనుకున్నవాళ్లే పార్టీ మారుతున్నారన్నారని చెప్పారు. ఇది రాజకీయాల్లో సహజమే అన్నారు.