బాబును ఏమనకుండా చిరంజీవి వైపు వెళ్లా: గంటా, 'జగన్కు రాజకీయాలు నేర్పేందుకే వారు వైసీపీలోకి'
విశాఖపట్నం/అమరావతి: ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీలో ఉండి, ఇప్పుడు పార్టీని వీడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆరోపణలు గుప్పించడాన్ని మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం ఖండించారు. గతంలో తాను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లేముందు చంద్రబాబును ఒక్క మాట అనకుండా వెళ్లిపోయానని గుర్తు చేశారు.
చంద్రబాబుపై, టీడీపీపై అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు హర్షించరన్నారు. చంద్రబాబును కాపుమిత్ర అని ప్రశంసించిన అవంతి శ్రీనివాస్ ఇప్పుడు ఆయనను కాపు వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారన్నారు. అవంతి కోసం భీమిలి నియోజకవర్గాన్ని సైతం వదులుకోవడానికి తాను సిద్ధపడ్డానని, అయినప్పటికీ, పార్టీని ఆయన వీడారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే టీడీపీ నుంచి అవంతి శ్రీనివాస్ బయటకు వెళ్లారని చెప్పారు.
టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్లకు రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని మరో టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. గతంలో జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రపై ఆమంచి రాళ్లు వేయించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలో చేరడం విడ్డూరమన్నారు. ప్రకాశం జిల్లాలో దళిత ఎస్పీని ఆమంచి ట్రాన్స్ఫర్ చేయించారన్నారు. వైసీపీలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాల పార్టీ టీడీపీ అని చెప్పారు. జగన్కు రాజకీయాలు నేర్పడానికే ఆమంచి, అవంతిలు ఆ పార్టీలో చేరినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.