గంటా ఎవరి వెంట..? శరవేగంగా మారుతున్న విశాఖ రాజకీయ పరిణామాలు..!!
విశాఖ / హైదరాబాద్ : గంటా శ్రీనివాసరావు.. తెలుగు రాష్ట్రాల్లో అది పరిచయం అక్కరలేని పేరు. కొన్ని సంవత్పరాలు పాటు రాజకీయాల్లో తాను అనుకున్నది అనుకున్నట్టు జరిగినా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎదురీత తప్పేలా కనిపించడం లేదు. ప్రస్తుతం తాను ప్రాతినిద్యం వహిస్తున్న భీమిలి లో తనకు అనుకూల వాతావరణం లేకపోవడంతో భవిష్యత్ అందకారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీ మారి మళ్లీ తాను కోరుకున్న చోట,తనకు అనుకూలంగా ఉన్న చోట సీటు దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఆయన చూపు ఆ రెండు పార్టీలవైపు పడుతున్నట్ఠు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యలో గంటా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పొచ్చనే చర్చ విశాఖ తీరంలో వీచే చల్లటి గాలి మాదిరిగా షికారు చేస్తోంది.
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న గంటా..! మరో సారి పార్టీ మారేందుకు ప్రణాళికలు..!!
రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది విచిత్ర ప్రస్థానం. రాజకీయాల్లో హేమాహేమీలకే సాద్యం కాని కొన్ని కార్యాలను గంటా సునాయసంగా దక్కించుకోగలిగారు. అందులో భాగంగా మారుతున్న కాలం ప్రకారం ఆయన కూడా పార్టీలు మారుతూ పదవులు కైవసం చేసుకుంటూ వచ్చారు. మంత్రి కావాలనే కోరికతో గంటా 2009లో టీడీపీని వీడి అప్పుడప్పుడే ప్రారంభమైన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తనకు రాజకీయ భవిష్యత్ ప్రసాదించిన అనకాపల్లి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గంటా విజయం సాధించారు. అయితే ఎన్నో ఆశలతో చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ 294 సీట్లలో కేవలం 18 సీట్లను మాత్రమే దక్కాయి. ఇక చేసేది లేక తన 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో కలిపేశారు.
టీడిపి వయా పీఆర్పీ టూ కాంగ్రెస్..!! అదీ గంటా ప్రస్థానం..!
కాంగ్రెస్లో మారుతున్న పరిణామాలతో నల్లారి కిరణ్కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన హయంలో గంటా కోరిక నెరవేరింది. నల్లారి కేబినెట్లో గంటా మంత్రి అయ్యారు. అయితే 2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో తలెత్తుకోలకేపోయింది. ప్రజారాజ్యం కూడా ఆ పార్టీతో కలిసి విశ్వాసం కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని గ్రహించిన గంటా తిరిగి సొంత గూటికి వచ్చేశారు. 2014 ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబునాయుడి కేబినెట్లో మంత్రి పదవి సంపాదించారు. గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.
బీమిలిలో ప్రతికూల వాతావరణం..! అందుకే పార్టీ మారితే అనుకున్న సీటు..!
ఇలా ఓటమి ఎరుగని నేతగా గంటా శ్రీనివాసరావు రికార్డు స్రుష్టించారు. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నా 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గంటా రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా తయారుకాబోతోంది. సొంత జిల్లాలో మంత్రి అయ్యన్నపాత్రుడితో విభేదాల కారణంగా క్యాడర్లో అసంతృప్తి ఉంది. అంతేకాకుండా గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని ఇటీవలి సర్వేలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదనే భయం గంటాలో కలుగుతోంది. తనకు అనుకూలమైన అనకాపల్లి సీటు తీసుకుందామనుకున్న జిల్లాలోని రాజకీయ సమీకరణాల దృష్ట్యా చంద్రబాబు అందుకు అంగీకరించకపోవచ్చు. ఈ నేపథ్యంలో గంటా ముందు ఉన్నది పార్టీ మారే ఆప్షన్ తప్ప మరోటి కనిపించడం లేదు.
ఈ సారి చంద్రబాబు సీటిచ్చే పరిస్థితి లేదు..! గెలుపు గుర్రాలకే సీట్లు అంటున్న టీడిపి..!!
అయితే ఆయన వైసీపీలోకి వెళతారా? లేక అన్నయ్యకు ప్రియమైన తమ్ముడు ప్రారంభించిన జనసేనలోకి వెళతారా అనేది తేలాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ-వైసీపీ హోరాహోరీ పోటీ ఉండడంతో రెండింటిలో ఏ పార్టీ గెలుస్తుందని అంచనా వేయడం కూడా కష్టంగా మారింది. జనసేన కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండడంతో ఏపీలో కర్ణాటక పరిస్థితి ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. అందుకే టీడీపీ గెలిచినా.. వైసీపీ గెలిచినా తన గెలుపు మాత్రం పక్కాగా ఉండాలనేది గంటా పట్టుదలగా కనిపిస్తోంది. జనసేనలో అయితే గంటాకు కోరిన స్థానం నుంచి టికెట్టు వస్తుంది. ఈ క్రమంలో జనసేన తరపున అనకాపల్లిలో పోటీ చేస్తే సునాయాసంగా విజయం సాధించవచ్చేనది గంటా వ్యూహంగా తెలుస్తోంది. అయితే వైసీపీ కూడా గంటాను ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. గంటాకు విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా జగన్ సిద్ధంగా ఉన్నారని వైసీపీ లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గంటా ఎటువైపు అడుగులు వేస్తారనే అంశం పై ఉత్కంఠ నెలకొంది.