జగన్కు ఆదిశేషగిరిరావు షాక్, ఎటువైపు?: వారంతా జనసేన వైపు చూస్తున్నారు కానీ!
గుంటూరు: సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కమలంను వీడి జనసేనలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. విశాఖపట్నంకు చెందిన బీజేపీ కీలక నేత చెరువు రామకోటయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పలువురు బీజేపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం పార్టీకి రావెల కిషోర్ బాబులు కూడా గతంలోనే రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. రాజీనామాల పరంపర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా తాకింది.
వైసీపీకి ఆదిశేషగిరి రావు గుడ్ బై!
తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు, జగన్కు సన్నిహితంగా మెలిగిన ఈయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇది వైసీపీకి ఊహించని షాక్. ఆయన గుంటూరు లోకసభ స్థానం అడిగితే, జగన్ విజయవాడ లోకసభ స్థానం ఇచ్చేందుకు మొగ్గు చూపడం వల్లే ఆయన పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఆయనను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు.
అప్రమత్తమైన జనసేన.. హడావుడిగా పిలిపించి: జగన్-పవన్లతో భేటీపై అసలు అలీ ఏం చెప్పారు?
నేతలకు పవన్ కళ్యాణ్ ఛాన్స్
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలలోని అసంతృప్తులకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన మరో ఛాయిస్గా కనిపిస్తోంది. కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉన్న నాదెండ్ల మనోహర్, టీడీపీ పట్ల అసంతృప్తితో ఉన్న రావెల కిషోర్ బాబు, బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్న ఆకుల వంటి వారు జనసేన వైపు చూశారు. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అసంతృప్తులు జనసేన వైపు చూసే అవకాశముంది.
జనసేన వైపు చూస్తున్నారు కానీ
అదే సమయంలో పవన్ కళ్యాణ్, ఏరికోరి నేతలను తీసుకుంటున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన తీసుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. అలాగే వచ్చిన ప్రతి సీనియర్ నేతకు సీటు వస్తుందనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే అరవై శాతం మంది యువతకే అవకాశం ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. ఇతర పార్టీలలో అసంతృప్తితో ఉండి, జనసేన వైపు చూస్తున్ నేతలకు ఇది చేదు అని చెప్పవచ్చు.
ఆదిశేషగిరి రావు ఎటువైపు చూస్తున్నారు?
ఇక, వైసీపీకి రాజీనామా చేసే ఆదిశేషగిరి రావు ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ సాగుతోంది. ఆయనకు బంధువు అయిన గల్లా జయదేవ్, గల్లా అరుణ కుమారిలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఆయన ఆశిస్తున్న గుంటూరు స్థానం టీడీపీలో చేరినా దక్కే అవకాశాలు లేవు. అయినా రాజకీయాలకు, ఫ్యామిలీకి సంబంధం లేదు. అందుకు ఇన్నాళ్లు కూడా గల్లా టీడీపీలో ఉంటే, ఆయన వైసీపీలో ఉన్నారు. ఆయన టీడీపీ వైపు చూస్తున్నారా, జనసేన వైపు చూస్తున్నారా అనేది ముందు ముందు తేలనుంది.