ఎన్నికలకు ముందు ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త, 20 శాతం మధ్యంతర భృతి
అమరావతి: ఏపీ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. 20 శాతం మధ్యంతర భృతికి (ఐఆర్) ఓకే చెప్పింది. ఇరవై శాతం ఐఆర్ నిర్ణయం వల్ల ఏడాదికి రూ.6,884 కోట్ల మేర ఖజానా పైన భారం పడనుంది. అలాగే అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా మధ్యంతర భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకొని వారికి శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు అంగీకరించారు. ఆ తర్వాత కేబినెట్ భేటీ అయి, దానికి ఆమోదం తెలిపింది.
సార్వత్రిక ఎన్నికలకు మరెంతో దూరం లేదు. ఎన్నికల కోడ్ సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ వర్గాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకునే దిశగా కేబినెట్ కసరత్తు చేసింది. ఈ క్రమంలో మధ్యంతర భృతిపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై అశితోష్ మిశ్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.
ఉద్యోగులకు ఎంతమేర మధ్యంతర భృతి ఇవ్వాలనే అంశంపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. 40 నుంచి 45 శాతం వరకు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.