టీడిపి కి తలనొప్పిగా మారిన వర్గ పోరు..! తమ్ముళ్ల తీరు పట్ల చంద్రబాబు అసహనం..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి టీడిపిలో వర్గపోరు తారా స్థాయిలో నడుస్తోంది. పేరుకు అందరూ ఒకే పార్టీ లో పని చేస్తున్నా విభేదాలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. పలానా అభ్యర్థి పోటీలో ఉంటే మద్దత్తు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్తున్నారు నేతలు. ఎన్నికల వేళ ఇటువంటి అసమ్మతి మాటలు అధికార పార్టీకు తలనొప్పిగా మారాయి. తేలికగా గెలిచి మరోసారి అధికారంలోకి వద్దామనుకుంటున్న అధినేత చంద్రబాబుకు ఇబ్బందికరంగా పరిణమించాయి. నందిగామ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్య సీటు ఇవ్వవద్దంటూ పార్టీ నేత కన్నెగంటి జీవరత్నం అండ్ బ్యాచ్ ఏకంగా నిరసన దీక్షలు చేశారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ తమకు వద్దంటూ నేతలంతా చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టారు. కొవ్వూరులో మంత్రి జవహర్కు ఎదురుగాలి తప్పలేదు. రెండు వర్గాలు.. జవహర్ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కాపీను చంద్రబాబుకు పంపారు. జవహర్ మాత్రం, తాను అందరివాడినంటూ సీటిస్తే కొవ్వూరులో పోటీచేస్తానంటున్నాడు. కాదంటే.. ఇంట్లోనే కూర్చుంటానంటూ ధైర్యంగా చెబుతున్నారు. తిరుపతిలో సుగుణమ్మ నాయకత్వానికి నిరసనగా 50 డివిజన్ల నాయకులు ఓ హోటల్లో సమావేశం పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇక గుంటూరు పశ్చిమం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చకోవటంతో ఈ సీటుపై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. రాజధాని నగరంలో కీలకమైన సీట్లలో గెలిచి జిల్లాలో చక్రం తిప్పాలని చాలామంది కలలు కంటున్నారు. కమ్మ, కాపు, బ్రాహ్మణ నేతలు ఈ సీటుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఎవరికి కేటాయించినా మరో వర్గం దూరం అవుతుందనే ఆందోళన లేకపోలేదు. మంగళగిరి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. కాండ్రు కమల టీడీపీలోకి రావటంతో టీడీపీ ఆశవహుల్లో ఆందోళన నెలకొంది. గుడివాడ, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీ నుంచి వచ్చిన వలస నేతలకు సీట్లు కేటాయించి, 2014లో ఓడిన టీడీపీ నేతలకు చంద్రబాబు మొండిచేయి చూపటాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు కొంత మంది నేతలు. గత ఎన్నికల్లో తాము విమర్శించిన నేతలను ఈ దఫా ప్రశంసిస్తూ ప్రచారం చేయాలా ? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ, రోజుకో సర్వే పూటకో నివేదికతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ, పార్టీలో నెలకొన్న ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిని చంద్రబాబు ఎలా అధిగమిస్తారనేది ఆసక్తిగా మారింది.