సిమెంట్ లారీలో నోట్ల కట్టలు
Recommended Video
అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు- ఎన్నికల సిబ్బంది, పోలీసులు పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. విజయవాడ వైపునకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీలో అక్రమంగా తరలిస్తున్న నోట్ల కట్టలను పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలోని ఎనికేపాడు చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
మొత్తం కోటి 90 లక్షల రూపాయలు ఉన్నట్లు తేలింది. ఓటర్లకు పంచడానికే ఈ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. కోటి 90 లక్షల రూపాయలకు సంబంధించిన ఎలాంటి పత్రాలు తన వద్ద లేవని పోలీసులు నిర్ధారించారు. పోలింగ్ కు ముందురోజు రాత్రి ఈ డబ్బును ఓటర్లకు పంచడానికి తీసుకెళ్తున్నట్లు అనుమానిస్తున్నామని కృష్ణాజిల్లా పోలీసులు తెలిపారు. ఏలూరుకు డబ్బును తరలిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్బంగా పోలీసులు భద్రతను చేశారు. చెక్ పోస్టుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానితులను వదిలి పెట్టట్లేదు. పోలింగ్ కు ముందు రోజు రాత్రి ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేయడానికి అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటీకే పలు చోట్ల అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మద్యం బాటిళ్లు, క్రీడా సామాగ్రిని సీజ్ చేశారు. తాజాగా- విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు వద్ద తనిఖీల్లో కోటి 90 లక్షల రూపాయల నగదు వెలుగు చూసింది. లారీలో ఎక్కించిన సిమెంట్ సంచుల మధ్య ఓ ప్లాస్టిక్ కవర్ లో నోట్లను దాచి పెట్టినట్లు పోలీసులు చెప్పారు. మొత్తం కోటి 90 లక్షల రూపాయలు ఉన్నాయని అన్నారు. ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. డబ్బును కంచికచర్ల నుండి ఏలూరుకు తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.