వైఎస్ జగన్ నాతో కలిసి రావాలి.. వస్తే స్వాగతిస్తా: చంద్రబాబు: జగన్ కు వచ్చేది ఒకటి, రెండు సీట్లే
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఓ ఆశ్చర్యకర ప్రకటన చేశారు. ఆయన అలాంటి స్టేట్ మెంట్ ఒకటి ఇస్తారని ఎవరూ ఊహించి ఉండరు. చివరికి-ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా. రాష్ట్రం కోసం తాను చేస్తోన్న పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. జగన్ తనతో కలిసి వస్తానంటే..తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని చెప్పారు.
జగన్ రాకను తాను స్వాగతిస్తానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పని చేయాలని సూచించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి ఒకటి, రెండు సీట్లే వస్తాయని అన్నారు. ఇంత తక్కువ సీట్లతో సాధించేదేమీ ఉండదని చంద్రబాబు నవ్వుతూ చెప్పారు. అందుకే తమతో కలిసి వస్తే స్వాగతిస్తామని, ఇందులో తప్పేమీ లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ, చంద్రబాబు నాయుడు దేశ రాజధానిలో ధర్మ పోరాట దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఓ జాతీయ ఆంగ్ల వార్తా ఛానల్ చంద్రబాబును సోమవారం మధ్యాహ్నం ఇంటర్వ్యూ చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకుని రావడానికి రాజకీయాలకు అతీతంగా పని చేయాలని భావిస్తున్నారా? అంటూ ఆ ఛానల్ ప్రతినిధురాలు వేసిన ప్రశ్నకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. కేంద్రాన్ని ఎదుర్కొనడానికి రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికోసం తాను రాజకీయ వైరుధ్యాన్ని కూడా పట్టించుకోనని చెప్పారు. కేంద్రాన్ని ఢీ కొట్టడానికి అన్ని పార్టీలు కూడా తనకు సహకరించాలని సూచించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనతో కలిసి పని చేస్తానంటూ ఆ సాదరంగా ఆహ్వానిస్తానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా కౌంటర్ ఇస్తారనేది ఆసక్తికరం.