తారా స్థాయికి చేరిన వర్గ పోరు..! అంతర్మదనం లో వైయస్ఆర్సీపి..!
అమరావతి/హైదరాబాద్ : రాబోవు ఎన్నికల్లో అధికారం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తోన్న వైసీపీని అంతర్గత కలహాలు వేధిస్తున్నాయా..? పార్టీలో కీలక నేతలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారా..? తాజా పరిస్థితులు గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్కి దగ్గర బంధువులు, పార్టీ పెట్టిన దగ్గర నుంచి నమ్మకంగా ఉండే నేతలు సఖ్యతాగా ఉంటూ పార్టీలో ఆదర్శంగా ఉండాల్సింది పోయి, ఒకరిపై ఒకరు కయ్యానికి కాలుదువ్వుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల మద్య ఇలాంటి అంతర్గత పోరేంటని నాయకులు అంతర్మదనానికి గురౌతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ జగన్ తో విభేదిస్తూ అంతర్గత కలహాలకు పాల్పడుతున్న ఆ నేతలు ఎవరు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
తారా స్థాయికి చేరుతున్న నేతల కలహాలు..! అయోమయంలో వైసీపి అదిష్టానం..!!
వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిల మద్య విభేదాలు తరాస్థాయికి చేరుకున్నాయి. స్వయాన బావ బామ్మరుదులు అయిన వారిద్దరూ ప్రకాశం జిల్లా రాజకీయంలో క్రియాశీల పాత్ర పోషిస్తుంటారు. అలాంటి వారు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవడంతో ఆ జిల్లా పార్టీలో తీవ్రస్థాయిలో గందరగోళం నెలకొంది. వీరిమధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుందనడానికి తాజా ఘటనే సాక్ష్యంగా నిలుస్తుంది. ఒంగోలు సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వైవీసుబ్బారెడ్డి స్థానాన్ని మరొకరికి కేటాయిస్తున్నట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి దర్శి పార్టీ కార్యక్రమంలో తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే రేసులో ఓడిపోయిన వ్యక్తి ఎంపీ స్థానాన్ని ప్రకటించడమేంటి? అందునా పార్టీ అధినేతను కాదని చెప్పడానికి ఆయన ఎవరూ అంటూ సుబ్బారెడ్డి వర్గం బహిరంగంగానే విరుచుకుపడుతున్నారు. ఒకరిపై ఒకరు అధినేత జగన్కు ఫిర్యాదు చేసి అధిష్ఠాన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారంటే వారిద్దరి పోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వివాదం అప్పటి నుంచే..! ఒకే ఒరలో రెండు కత్తులు ఎలా సాద్యం అంటున్న పార్టీ శ్రేణులు..!!
కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ ఇద్దరు బావా బామ్మరుదులుగా కలిసి పనిచేస్తూ జిల్లా రాజకీయాలను శాసించారు. అక్కడ నుంచి వైసీపీలోకి వచ్చినప్పుడు కూడా అలానే కొనసాగారు. అయితే 2014 ఎన్నికలు వారిద్దరి మధ్య స్పర్థలు మిగిల్చింది. ఒంగోలు అసెంబ్లీ బరిలో తిరుగులేని నాయకుడిగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జనార్థన్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1999 నుంచి ఓటమి ఎరుగని నాయకుడిగా చక్రం తిప్పుతున్న బాలినేని 2014 ఎదురుదెబ్బ తట్టుకోలేకపోయారు. దాంతో తన ఓటమికి కారణం తన బావే అని నిర్ధారించుకుని ఆయనకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
వేడెక్కిన ప్రకాశం జిల్లా రాజకీయాలు..! ఒంగోలులో నువ్వా నేనా అనుకుంటున్న నేతలు..!!
ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన వైవీ సుబ్బారెడ్డి తనను మాత్రం ఓడించారనే కోపంతో రగిలిపోయారు బాలినేని. అప్పటి నుంచి ఎవరి వర్గాన్ని వారు ప్రోత్సహిస్తూ వచ్చారు. చివరకు పార్టీ కార్యక్రమాలైనా సరే ఒకరి ఫొటో ఉన్న ఫ్లెక్సీలో మరొకరికి స్థానం లేనంతగా వారి మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు తాజా వివాదం వారిలో మరింత అగాదాన్ని పెంచింది. వైవీ సుబ్బారెడ్డికి చెక్ పెట్టేందుకు ఒంగోల్ పార్లమెంట్ స్థానం నుంచి వేరొకరిని బరిలోకి దింపాలని వ్యూహం రచించారు బాలినేని.
ఎన్నికల ముందు ఏంటిది..? జగన్ ను విస్మయానికి గురి చేస్తున్న నేతల తీరు..!!
ఆ క్రమంలోనే దర్శి అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి పేరును కార్యకర్తల సమావేశంలో బయపెట్టారు. ఈ అంశమే సుబ్బారెడ్డి వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ పంచాయితీని ఇప్పుడు జగన్ దగ్గరకు తీసుకొచ్చారు. రాష్ట్రం మొత్తం తమకి అనుకూలంగా ఉందటూ చెప్పుకుంటూ తిరుగుతున్న జగన్కు వీరి గొడవ తలనెప్పిగా పరిణమించినట్టు చర్చ జరుగుతోంది. వీరి గొడవ జిల్లాలో ఇతర అసెంబ్లీ స్థానాల్లో ఎటువంటి ప్రభావం చూపనుందో అని పార్టీ శ్రేణుల్లో భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇలా అంతర్గత కుమ్ములాట ఎటుదారి తీస్తుందో అని పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు పార్టీకి నష్టం చేస్తాయని, సాద్యమైనంత తొందరగా ఇలాంటి విభేదాలు రచ్చకెక్కకుండా జాగ్రత్త పడాలని పార్టీ అధినేతకు సూచనలు అందుతున్నట్టు తెలుస్తోంది.