టీడీపీలో మరో వికెట్! గుడ్ బై చెప్పనున్న పితాని: వైఎస్ఆర్ సీపీలో కర్చీఫ్ వేసినట్టే?
అమరావతి: తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడబోతోందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. ఆయనే- పితాని సత్యనారాయణ. కార్మికశాఖ మంత్రి. త్వరలోనే ఆయన టీడీపీని వీడబోతున్నారని తెలుస్తోంది. రెండురోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే ఆయన వైఎస్ఆర్ సీపీ కీలక నాయకులకు సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
నిజానికి- పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకుడేమీ కాదు. 2014 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మాత్రమే ఆయన టీడీపీలో చేరారు. పితాని సత్యానారాయణ రాజకీయ జీవితం ఎక్కువకాలం కాంగ్రెస్ లోనే కొనసాగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. వైఎస్ హఠాన్మరణం అనంతరం, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా మంత్రివర్గంలో పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా పితానికి పేరుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీలోనూ కొన్నాళ్లపాటు పనిచేశారు.
రాష్ట్ర విభజనతో పాటు ఎన్నికలు రావడంతో.. ఆయన తెలుగుదేశంలో చేరారు. ఓరకంగా చెప్పాలంటే.. ఆ సీజన్ లో తెలుగుదేశం పార్టీలో చేరిన చిట్టచివరి వ్యక్తి ఆయనే. 2009లో తూర్పు గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2014లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకోగలిగారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో.. పితాని పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో కొనసాగినప్పటికీ.. ఆ పార్టీతో పెద్దగా అనుబంధాన్ని పెంచుకోలేదాయన. కాంగ్రెస్ లో ఉండగా.. తెలుగుదేశం పార్టీపై ఘాటుగా విమర్శలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ సీపీలో చేరాలని పితాని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.