టీడీపీ నేతల వైపు జ.. గన్ గురి..! ఎప్పుడు ఏ తూటా పేలుతుందోనని ఝడుసుకుంటున్న నేతలు..!!
అమరావతి/హైదరాబాద్ : టీడిపి నేతల్లో కలవరం మొదలైంది. ప్రమాణ స్వీకారం తర్వాత యువ సీఎం ఏం చేస్తారనే ఆందోళన టీడిపి నేతలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు తమ్ముళ్లను టీడీపీ ఓటమికంటే.. జగన్ ఏం చేస్తాడనే ఆలోచన భయపెడుతోంది. ఐదేళ్లపాటు బాబు సర్కారులో ఇబ్బంది చవిచూసిన నేతలంతా కక్షసాధింపునకు సై అంటున్నారు. ఇప్పటికే గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పగ ప్రతీకార దాడులు మొదలయ్యాయి. టీడీపీ నాయకులు ఊళ్లు వదలి వలస పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ముందుగానే ఊహించిన జగన్.. రాయలసీమ జిల్లాల్లో సమర్థులైన పోలీసు అధికారులను నియమించాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే ఐపీఎస్ల జాబితా సేకరించి బదిలీలకు సిద్ధమయ్యారట.
ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ సర్జికల్ స్ట్రైక్..! ఆందోళనలో ప్రతిపక్ష నేతలు.!!
ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన అనంతరం సర్దుబాట్లు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ కేడర్కు చెందిన స్టీఫెన్ రవీంధ్రకు కీలకమైన ఇంటెల్జెన్స్ విభాగానికి రప్పించుకున్నారు. ఏపీ ఓటర్ల డేటా చోరీ చేసిన ఐటీగ్రిడ్ కేసును స్టీఫెన్ రవీంధ్ర సారధ్యంలో జరగటం ప్రస్తావించాల్సిన అంశం. రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న ఐటీగ్రిడ్ అధినేత అశోక్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇటువంటి అపరేషన్స్ చేయటంలో దిట్ట అయిన స్టీఫెన్కు బాధ్యతలు అప్పగించటం ద్వారా జగన్ తన ప్రణాళిక ఎలా ఉండబోతుందనేది చెప్పకనే చెప్పారు.
అంతా తుపాను ముందు ప్రశాంతతే..! సంకేతాలిచ్చిన జగన్..!!
ఢిల్లీ వెళ్లిన మొదటిరోజు పోలవరం, రాజధాని భూముల విషయంలోనూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. రైతుల వద్ద భూములు లాక్కోవటం, అడ్డగోలు కొనుగోళ్లు, టీడీపీ సాగించిన దమనకాండపై దర్యాప్తు ఉంటుందని స్పష్టంచేశారు. పోలవరం ఎవరికి వరంగా మారిందనేది తనకు తెలుసంటూ.. ఇది కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టుగా పేర్కొన్నారు. పనులు సకాలంలో పూర్తిచేయకుండా వాయిదా వేస్తూ వచ్చిన కాంట్రాక్టర్లను తప్పిస్తామంటూ హింట్ ఇచ్చారు. అగ్రిగోల్డ్, విశాఖభూములు, విజయవాడలో కాల్ మనీ వ్యవహారం, వనజాక్షిపై దాడి కేసు వీటితోపాటు ఇసుకు దోపిడీ, గనుల కైంకర్యం వంటివి చింతమనేని, యరపతి నేని వంటి నేతలను వణికిస్తున్నట్టు తెలుస్తోంది.
అన్ని కక్కిస్తా..! రాజన్న రాజ్యం తెస్తానంటున్న యంగ్ సీఎం..!!
ఎల్ ఈడీ బల్బుల పేరిట ఏకంగా 10వేల కోట్లరూపాయలు దోపిడీ చేశారంటూ లోకేష్బాబుపై ఆరోపణలు ఉండనే ఉన్నాయి. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా చినబాబు పేరు వినిపిస్తుంది. మరో మంత్రి వర్యుడు దేవినేని ఉమా.. సాగునీటి పారుదల శాఖ మంత్రిగానే కాదు.. తానే నెంబరు 2 అనేంతగా అధికారులపై పెత్తనం, అవినీతిలో అధికభాగం ఉందనే విమర్శలు చవిచూస్తున్నారు. పోలవరం నిర్మాణంలో ఉమా అవినీతి తారాస్థాయికి చేరిందంటూ పలుమార్లు వైసీపీ నేతలు విమర్శిస్తూ వచ్చారు. తాము అధికారంలోకి వస్తే దీనిపై విచారణ జరిపిస్తామంటూ హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భూముల వ్యవహారం, ఆభరణాల అంశాలు ఇవన్నీ జగన్ పాలనపగ్గాలు చేపట్టగానే ఒక్కోకటిగా వెలికి తీస్తారనే ఆలోచన కూడా చంద్రబాబునాయుడులో ఉన్నాయట.
అర్థం కాని జగన్ వ్యూహం..! ఎలా ముందుకు వెళ్తారనే అంశం పై ఉత్కంఠ..!!
ప్రతికూల మీడియా నుంచి తనకు వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతో జగన్ ఆచితూచి స్పందిస్తున్నారు. తండ్రి మాదిరిగా కక్ష సాధింపునకు దిగకుండా న్యాయ పరిధిలో వ్యవహరిస్తానంటున్నారు. తాను తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ జీవో ల రూపంలో ఎప్పటికపుడు అందుబాటులో ఉంచుతానంటూనే.. తప్పులు ఎంచితే పర్వాలేదు. కానీ కావాలని తప్పుడు రాతలు రాస్తే.. కోర్టుకు ఈడ్చుతానంటూ తెగేసి చెప్పారు. ఈ లెక్కన.. టీడీపీని కట్టడి చేయాలనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమను.. తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్యాన్ రెక్కల కిందకు.. ఎంపీలు కమలం నీడకు వెళ్లాలని ఆశపడుతున్నారట. ఈ లెక్కన జగన్.. ఏం చేస్తాడనే భయం తెలుగు తమ్ముళ్లను వెంటాడుతున్నట్టు తెలుస్తోంది.