పట్టాలెక్కిన పాలన..! సీయం కుర్చీలో తొలి సారి కూర్చోబోతున్న జగన్.. !!
అమరావతి/హైదరాబాద్: జగన్ కోసం ఏపి సచివాలయంలో ఏర్పాట్లు చకచకా జరిగి పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తొలిసారి సచివాలయానికి వెళ్లనున్నారు. నిన్న సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జగన్, నేడు ఫస్ట్ టైమ్ సెక్రటేరియేట్ కు రానుండటంతో, పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. నేడు, రేపు ఆయన సచివాలయంలో ఉంటారని, పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ నేతలు ప్రకటించారు. ఇక జగన్ కోసం సీఎం చాంబర్ ను అధికారులు సరికొత్తగా ముస్తాబు చేశారు. సీఎం చైర్ పై జగన్ తొలిసారి నేడు ఆసీనులు కానున్నారు. క్యాబినెట్ హాల్, హెలిపాడ్ లు, తాడేపల్లి నుంచి సచివాలయం వరకూ కాన్వాయ్ రూట్ సిద్ధమయ్యాయి. చాంబర్ ముందు సీఎం నేమ్ ప్లేట్ రెడీ అయింది. చాంబర్ లో మార్పులు, నేమ్ ప్లేట్ తదితరాలను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు.
నవ్యాంధ్రలో కొలువుదీరిన వైఎస్ జగన్ ప్రభుత్వం శుక్రవారం తన తొలి జీవోను జారీ చేసింది. నిన్న ప్రమాణ స్వీకారోత్సవం తరువాత వయోవృద్ధులకు ఇస్తున్న పెన్షన్ ను 2 వేల రూపాయల నుంచి నుంచి 2,250 రూపాయలకు పెంచుతున్నట్టు జగన్ ప్రకటించి, తన తొలి సంతకాన్ని ఆ ఫైల్ పై పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇలా ప్రతీ ఏటా 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతారు. ఈ పథకానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని పేరు పెట్టారు. దీనిపై చీఫ్ సెక్రెటరీ జీవోను విడుదల చేశారు. వికలాంగులకు 3 వేలరూపాయలు, కిడ్నీ బాధితులకు 10 వేల రూపాయలతో పాటు వయోవృద్ధుల పెన్షన్ వయసును 65 నుంచి 60కి కుదిస్తున్నట్టు జీవోలో పొందు పరిచారు. జూలై 1 నుంచి కొత్త పెన్షన్ పథకం అమలవుతుందని ఇందులో పేర్కొన్నారు.