బీసిల పైన దొంగప్రేమ వలకబోస్తున్న జగన్..! బీసిల అభ్యున్నతే టీడిపి లక్ష్యమన్న బాబు..!!
అమరావతి/ హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నిర్వహించిన జయహో బీసీ సభతో వైఎస్ఆర్సీపీ ఖంగారుపడిందని, ఆ షాక్ నుండి తేరుకోలేకపోవడం తోనే జగన్మోహనరెడ్డి ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం ఎలక్షన్ మిషన్ 2019పై టీడీపీ నేతలు, బూత్ స్ధాయి కన్వీనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నిరాశా, నిస్పృహలతోనే వైఎస్ఆర్సీపీ ఏలూరులో సభ పెట్టారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని, జనాభాలో 50 శాతం ఉన్న బీసీల మద్దతు టీడీపీకే ఉంటుందన్నారు. దాన్ని జీర్ణించుకోలేకే వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహనరెడ్డి మొసలి కన్నీరు బీసీలు నమ్మరని చెప్పారు.
బీసీ సబ్ ప్లాన్ కు టీడీపీ ప్రభుత్వమే చట్టబద్దత కల్పించిందని, మళ్ళీ చట్టబద్దత చేస్తాననడం జగన్మోహనరెడ్డి అవివేకమన్నారు. బడ్జెట్ గురించి, నిధుల విడుదల గురించి జగన్ కు తెలియదని, ప్రాథమిక ఆర్థిక నిబంధనల పరిజ్ఞానం ఆయనకు లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఐదేళ్ళ టీడీపీ పాలనలో కౌలు రైతుల్లో పూర్తి భరోసా కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కౌలు రైతులకు కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం 15వేలు ఇస్తోందని చెప్పారు. కౌలు రైతులకు 9654 కోట్ల రూపాయల మేరకు పంట రుణాలు చేయడం దేశంలోనే రికార్డు అని తెలిపారు. అలాగే కాపులకు మునుపెన్నడూ లేని లబ్ది చేశామని, కాపు కార్పొరేషన్ పెట్టి భారీ నిధులిచ్చామని, కాపు భవన్ లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
కులం, మతం మన అజెండా కాదని రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ అజెండా అని చెప్పారు. పసుపు కుంకుమ ఒక అన్న ఇచ్చాడని చెల్లుళ్ళు భావిస్తున్నారని, అలాగే పెన్షన్లు తమ ఇంటి పెద్ద కొడుకు ఇచ్చాడని వృద్ధులు భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయం తీసుకుంటూ ముందకు పోతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.