మూడు రాజధానులపై జనసేన క్లారిటీ: హైకోర్టులో అఫిడవిట్: మా వైఖరి అదే: మూడు వద్దు.. ఒకటేచాలు
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుపై జనసేన పార్టీ.. తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ను దాఖలు చేసింది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే విషయాన్ని జనసేన పార్టీ ఇదివరకు పలు సందర్భాల్లో ప్రకటించింది. ఇదే అంశాన్ని హైకోర్టుకు అందజేసిన అఫిడవిట్లో చేర్చినట్లు తెలుస్తోంది. మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని, అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సహా ఇతర నాయకులు పలుమార్లు వెల్లడించారు.
వైఎస్ జగన్కు డిక్లరేషన్ సెగ: లోటస్పాండ్ నివాసం చుట్టూ: బజరంగ్దళ్ ముట్టడి పిలుపుతో
ఏపీ హైకోర్టులో అఫిడవిట్.. నిన్న కాంగ్రెస్..
అమరావతిపై అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను అఫిడవిట్ రూపంలో తెలియజేయాలంటూ ఏపీ హైకోర్టు ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా- జనసేన పార్టీ దీన్ని న్యాయస్థానానికి సమర్పించింది. తొలుత కాంగ్రెస్ అఫిడవిట్ ఇచ్చింది. మంగళవారమే కాంగ్రెస్ నేతలు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. తాజాగా జనసేన పార్టీ అదే బాటలో నడిచింది. అమరావతికి సంబంధించినంత వరకూ తమ అభిప్రాయాన్ని వివరిస్తూ హైకోర్టులో అఫిడవిట్ను దాఖలు చేసింది.
అమరావతికే కట్టుబడి..
రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండాలనేది జనసేన డిమాండ్. ఈ డిమాండ్ను అనేక సందర్భాల్లో వెల్లడించింది. పలు రూపాల్లో వ్యక్తీకరించింది. మూడు రాజధానుల ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామంటూ కొద్దిరోజుల కిందటే పవన్ కల్యాణ్ బహిరంగంగా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తమ పార్టీ నేతల ద్వారా క్షేత్ర స్థాయి అభిప్రాయాలను సేకరించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని పవన్ కల్యాణ్ ముందు నుంచీ చెబుతూనే వస్తున్నారు. ఇదే విషయాన్ని అఫిడవిట్లోనూ చేర్చారని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
రైతుల పొట్ట కొట్టకుండా..
అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తారనే ఉద్దేశంతో ఆ ప్రాంత రైతులు వేలాది ఎకరాల పొలాలను ప్రభుత్వానికి అప్పగించారని, మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల వారు అన్యాయానికి గురవుతారనేది జనసేన పార్టీ నేతల వాదన. అమరావతి ప్రాంతంలో భూములను త్యాగం చేసిన 28 వేల మంది రైతుల భవితవ్యం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అగమ్యగోచరంగా మారుతుందని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. భూములిచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగకూడదనేదే తమ అభిమతమని, దాని కోసం ఎంతకైనా పోరాడుతామని అంటున్నారు.
రోజువారీ విచారణ..
ఇదిలావుండగా.. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు దాఖలు చేసిన పిటీషన్లపై ఏపీ హైకోర్టు ఇక రోజువారీ విచారణను చేపట్టింది. సోమవారం నాడు ఈ పిటీషన్లపై రోజువారీ విచారణను ఆరంభించింది. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి అనుకూలంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై ఇదివరకు విధించిన స్టేటస్కోను మళ్లీ పొడిగించింది. వచ్చేనెల 21వ తేదీ వరకు పొడిగించింది. అప్పటిదాకా రోజువారీ విచారణను ఏపీ హైకోర్టు ముగించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.