నేను రాజీనామా చేయలేదు: 22న నామినేషన్ వేస్తున్నా: జనసేన ఎంపీ అభ్యర్థి ఆకుల స్పష్టీకరణ
అమరావతి: జనసేన పార్టీ రాజమహేంద్రవరం లోక్ సభ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ రాజీనామా వ్యవహారం వదంతులు మాత్రమేనని స్పష్టమైంది. తాను పార్టీకి రాజీనామా చేయలేదని ఆయన వెల్లడించారు. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని తోసి పుచ్చారు. దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
గిట్టని వాళ్లు తనపై తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. ఎప్పట్లాగే తాను రాజమహేంద్రవరం లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని అన్నారు. ఈ నెల 22వ తేదీన తాను నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నానని ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రచారం ఉండటం వల్ల పార్టీ సమావేశాలకు హాజరు కాలేకపోయానని ఆకుల సత్యనారాయణ వివరణ ఇచ్చుకున్నారు.
అంత మాత్రాన తాను రాజీనామా చేసినట్టు కాదని చెప్పారు. అంతకుముందు- తెలుగుదేశం, జనసేన పార్టీ లోపాయకారి ఒప్పందాల వల్ల మనస్తాపానికి గురైన ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వార్తలు వెలువడిన కొన్ని గంటల తరువాత- ఆకుల స్పందించారు. తాను రాజీనామా చేయట్లేదని అన్నారు.