పవన్ కళ్యాణ్ టార్గెట్ 60, వైసీపీ-టీడీపీ పరిస్థితి ఇదేనా?: జగన్ను అలా దెబ్బకొట్టారు!
అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో త్రిముఖపోటీ ఉండనుంది. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య పోరు ఉండనుంది. 175 నియోజకవర్గాలకు గాను హోరాహోరీ అధికార, ప్రతిపక్షాల మధ్యే ఉండనుందని చాలామంది భావిస్తున్నారు. పలుచోట్ల జనసేన.. టీడీపీ, వైసీపీ గెలుపోటములపై ప్రభావం చూపించడంతో పాటు ఆ పార్టీ కూడా రానున్న ప్రభుత్వంలో కీలకమయ్యేలా సీట్లు గెలుచుకోనుందని భావిస్తున్నారు.
నన్ను జగన్ను కలుపుతారా, డేటాచోరీపై ఆటలు ఆపండి: కేసీఆర్-బాబులపై పవన్ కీలక వ్యాఖ్యలు
టార్గెట్ 60.. గెలుపు 30
ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 88. టీడీపీ, వైసీపీలు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినందున ఈ రెండు పార్టీలు కూడా మేజిక్ ఫిగర్కు చేరుకోవడం సులభమైన విషయమేమీ కాదని చెబుతున్నారు. ఓ విధంగా కర్ణాటక తరహా పరిస్థితులు ఏర్పడవచ్చునని భావిస్తున్నారు. ప్రధానంగా జనసేనాని ఏపీవ్యాప్తంగా తిరుగుతున్నప్పటికీ ఆ పార్టీ అంతర్గతంగా దాదాపు 60 నుంచి 90 స్థానాలపై ప్రధానంగా దృష్టి సారించిందని తెలుస్తోంది. ఇందులో 30కి పైగా స్థానాలు గెలుచుకోవచ్చునని భావిస్తోందట. జనసేనకు లెఫ్ట్ పార్టీ తోడవడం వల్ల మరిన్ని సీట్లు గెలుచుకోనుందని అంటున్నారు.
అదే నిజమైతే పవన్ మద్దతు అవశ్యం
ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీకి మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా ఉండదని భావిస్తున్నారట. అంటే ఏ పార్టీ అయినా డెబ్బై నుంచి ఎనభై సీట్ల మధ్య గెలుచుకోవచ్చునని చెబుతున్నారు. అదే నిజమైతే అప్పుడు వచ్చే ప్రభుత్వంలో జనసేన కీలకంగా మారనుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన పార్టీయే అధికారంలోకి వస్తుందని అంటున్నారు.
జగన్ను అలా దెబ్బతీసిన చంద్రబాబు
చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఇటీవలి వరకు విపక్షాలు చెప్పాయి. అయితే, ఆ తర్వాత చంద్రబాబు ప్రకటించిన పథకాలు కొంత సానుకూలతను తీసుకువెళ్లాయని అంటున్నారు. దీంతో ఎన్నికలకు ముందు టీడీపీ పుంజుకుందని చెబుతున్నారు. ఓ విధంగా ఇటీవల వరుస పథకాల వల్ల చంద్రబాబు.. జగన్ను దెబ్బతీశారనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ పథకాలను టీడీపీ కాపీ చేసిందని చెబుతున్నప్పటికీ.. ఆ పథకాలు మాత్రం జగన్ను ఒకింత కార్నర్ చేశాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకుంటే పవన్ కీలకం కానున్నారని చెబుతున్నారు.