అమరావతి రైతుల అరెస్టు గర్హనీయం, ఒప్పందం ఉల్లంఘించొద్దు: పవన్ కళ్యాణ్
అమరావతి: కౌలు అడిగిన రాజధాని రైతులను అరెస్ట్ చేయడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరు భావ్యం కాదన్నారు. ఒప్పందం ప్రకారం - భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ ఏప్రిల్ మాసంలో వార్షిక కౌలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలో రైతాంగం..
ఒప్పందంలోని నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం గత యేడాది కూడా ఉల్లంఘించి ఆలస్యంగా ఇచ్చింది. వరుసగా రెండో యేడాది కూడా కౌలు చెల్లింపు జాప్యం చేస్తూ... ఆ సొమ్ములు వస్తాయో రావో అనే ఆందోళనలోకి రైతాంగాన్ని నెట్టేసింది. 28వేల మందికిపైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారు. వీరికి ఈ యేడాది రూ.189.7 కోట్లు కౌలుగా చెల్లించాల్సి ఉంది. ఎకరాకీ ప్రతి ఏటా రూ.3 వేలు మెట్టకీ, రూ.5 వేలు పెంచాల్సి ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
రెండు జీవోలు చేశారు కానీ..
సి.ఆర్.డి.ఏ. రైతులతో చేసుకొన్న ఒప్పందాన్ని గౌరవించాలి. కరోనా కష్ట సమయంలో సకాలంలో కౌలు చెల్లించాలని రైతులు అధికారులను కోరారు. జనసేన పార్టీ కూడా రైతుల పక్షాన కౌలు సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జూన్ 21వ తేదీన కౌలు విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను జారీ చేసినా ఏ రైతు ఖాతాలోకీ కౌలు మొత్తం రాలేదు. ఆ జీవోలు వచ్చి రెండు నెలలు దాటినా సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆ సొమ్ము చెల్లించకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
Recommended Video
ఇది ఒప్పందం ఉల్లంఘనే..
తమ ప్రాంతంలో రాజధాని నిలుపుకోవడం కోసం 250 రోజులకి పైబడి రైతులు పోరాటం చేస్తున్నారు. ఆ రైతులకు న్యాయం చేయాల్సిన తరుణంలో వార్షిక కౌలు కూడా చెల్లించకుండా జాప్యం చేయడం ఒప్పందం ఉల్లంఘనే అవుతుంది. ఆ కౌలు మొత్తం అడిగేందుకు సి.ఆర్.డి.ఏ. కార్యాలయానికి వెళ్ళిన 180 మంది రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని ఖండిస్తున్నాను. తమకు న్యాయంగా రావాల్సిన కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేసిన తీరు గర్హనీయం. తక్షణమే రైతులకు రావాల్సిన కౌలు ఇచ్చి ఒప్పందాన్ని గౌరవించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.