ఏపికి కెసిఆర్ : ముహూర్తం ఫిక్స్: ఏం గిఫ్ట్ ఇస్తారు..!
Recommended Video
తెలంగాణ ముఖ్యమంత్రి..టిఆర్యస్ అధినేత కేసిఆర్ ఏపి ఎంట్రీ ముహూర్తం ఖారారైంది. ఈ మేరకు ఏపి ప్రభుత్వా నికి ఆయన రాకకు సంబంధించిన సమాచారం అందింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత కేసిఆర్ తాను ఏపి రాజకీయాల్లొ జోక్యం చేసుకుంటానని..చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన ఫెడరల్ ఫ్రంట్ యాత్ర ఏపి నుండే ప్రారంభిస్తున్నారు. ఇంతకీ కేసిఆర్ ఏం గిఫ్ఠ్ తెస్తారు...ఇస్తారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏపిలో తొలి విడత పర్యటన ఖరారైంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇక జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తానని కేసిఆర్ ప్రకటించారు. అందులో భాగంగా.. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటుకు చొరవ తీసుకుంటానని చెప్పుకొచ్చారు. వచ్చే ఫిబ్రవరి 25న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసిఆర్..ఇక జాతీయ రాజకీయాల పై దృష్టి సారించారు. తెలంగాణ లో క్యాబినెట్ విస్తరణ కంటే ముందుగానే జాతీయ రాజకీయాల్లో తొలి విడత చర్చలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకు తొలి పర్యటన ఏపిని ఎంచుకున్నారు. అక్కడి నుండి ఇతర రాష్ట్ర పర్యటన లు పూర్తి చేయాలని కేసిఆర్ భావిస్తున్నారు.
23న విశాఖకు కేసిఆర్...వైసిపి మద్దతిస్తుందా
కేసిఆర్ తన పర్యటనలో భాగంగా..ఈ నెల 23న ఏపిలోని విశాఖకు రానున్నారు. ఏపికి చేరుకోగానే ముందుగా విశాఖలో ని శారదా పీఠంకు వెళ్తారు. అక్కడ స్వరూపానంద స్వామి ఆశీర్వాదం తీసుకుంటారు. దాదాపు గంట సేపు అక్కడే ఆయన షెడ్యూల్ ఏర్పాటు అయింది.
ఆ తరువాత విశాఖ నుండి భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఈ మేరకు ఏపి అధికారు లకు టెంటిటివ్ షెడ్యూల్ అందింది. అయితే, విశాఖలో ఉన్న సమయంలో కేసిఆర్ ను ఎవరు కలుస్తారనేది ఇప్పుడు ఏపి రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది. ఏపిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలని భావిస్తున్న కేసిఆర్ కు రాజకీయంగా వైసిపికి సహకరిస్తారా..పవన్ కళ్యాన్ కు సహకరిస్తారా అనేది ఆసక్తి కరంగా మారింది. దీంతో పాటుగా ఏపిలో కేసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ - పవన్ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తారని సమాచారం.
ఇప్పటికే చంద్రబాబు బిజేపీయతర ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్ తో కలవటం తో ఆ ఫ్రంట్లో వారు చేరే అవకావం లేదు. దీంతో...ఇప్పుడు కేసిఆర్ ఏపి పర్యటనలో ఏ పార్టీ నేతలు కలుస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే సమయంలో కేసిఆర్ అభిమాన సంఘం అంటూ కొందరు తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత కేసిఆర్ కు అభినందనలు తెలుపుతూ సందేశాలు పంపారు. వారు కేసిఆర్ ను ఏపికి ఆహ్వానించారు. వారికి తనను కలిసేందుకు కేసిఆర్ అప్పాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏపి నుండి ఆరంభం..హస్తిన వరకు పోరాటం..
ఇప్పటికే ఎంఐఎం మద్దతు కూడగట్టిన కేసిఆర్..తరువాతి అడుగు ఏపిలో వేస్తున్నారు. ఇక్కడ వైసిపి..జనసేన రెండు పార్టీలు కేసిఆర్ తో సన్నిహితంగానే ఉంటున్నాయి. ఇక్కడి నుండి కేసిఆర్ నేరుగా భువనేశ్వర్ వెళ్తారు. అక్కడ కోణా ర్క్ టెంపుల్...జగన్నాధ ఆలయాలను దర్శించుకొని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశం అవుతారు. ఆ తరువాతి రోజు ఢిల్లీ వెళ్తారు. ఇప్పటికే కేసిఆర్..ప్రధాని మోదీ అప్పాయింట్మెంట్ సైతం కోరినట్లు తెలుస్తోంది. ఇక, ఢిల్లీలో రెండు రోజులు ఉండే కేసిఆర్ అక్కడ నాన్ కాంగ్రెస్ - నాన్ బిజెపి పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ వంటి వారితో గతంలోనే సమావేశమైన కేసిఆర్..తిరిగి ఇప్పుడు మమత తో పాటుగా అఖిలేష్, మాయావతి ని సైతం కలిసే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ ప్రధాని అభ్యర్ధిత్వాన్ని మమత-మాయావతి-అఖిలేష్ వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో కేసిఆర్ తో పాటుగా వారు కలిసొచ్చే అవకాశం ఉంది.
బాబుకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి...
ఇక, ఏపిలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన కేసిఆర్ తన ఏపి పర్యటనలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా ఉంది. ఇప్పటికి ఎన్నికల ప్రచారం లేకపోవటంతో..చంద్రబాబు పై విమర్శలు చేసే అవకాశం లేదు. ఇదే సమయంలో తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ తో ఎటువంటి ఉపయోగం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్య లపై కేసిఆర్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఈ అంశం తో పాటుగా..ఏపి రాజకీయాలు..జాతీయ సమీకరణాల పై కేసిఆర్ విశాఖ వేదికగా మాట్లాడే అవకాశం ఉంది. ప్రచారం కాకపోయినా..తన సందేశం ప్రజల్లోకి వెళ్లే విధంగా కేసిఆర్ విశాఖ నుండే తన వాయిస్ వినిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో..ఇప్పుడు కేసిఆర్ విశాఖలో ఏం చేస్తారో వేచి చూడాల్సిందే..