జగన్ పాదయాత్ర: ఇచ్ఛాపురంలోని వైసీపీ పైలాన్ అద్భుతం, ఎలా ఉందంటే?
Recommended Video
శ్రీకాకుళం/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర బుధవారం (09-01-2019)తో ముగుస్తోంది. పాదయాత్ర చివరి రోజు జగన్ తన యాత్రను కొత్తకొజ్జిరియా నుంచి ఈ ఉదయం ప్రారంభించారు. వేదపండితులు జగన్ను ఆశీర్వదించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగుస్తోంది. 6 నవంబర్ 2017న ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. అంతకుముందు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
జగన్ పాదయాత్ర ద్వారా రికార్డ్ బద్దలు కొట్టారు. ఆయన 341 రోజుల్లో 3,648 కిలో మీటర్లు నడిచారు. షర్మిల 230 రోజుల్లో 3,112 కిలో మీటర్లు, చంద్రబాబు 208 రోజుల్లో 2,800 కిలో మీటర్లు, వైయస్ రాజశేఖర రెడ్డి 90 రోజుల్లో 1,474 కిలో మీటర్లు నడిచారు.
91 అడుగుల ఎత్తైన పైలాన్
ఇచ్ఛాపురంకు ఏపీలోని 175 నియోజకవర్గాల వైసీపీ కోఆర్డినేటర్లు వచ్చారు. అయ్యవారిపేట, లొద్దపుట్టి మీదుగా పేటూరు, ఇచ్ఛాపురం టౌన్ వరకు జగన్ ప్రజాసంకల్పయాత్ర సాగుతుంది. ఇచ్ఛాపురం వద్ద పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఈ పైలాన్ 91 అడుగుల ఎత్తులో ఉంటుంది. విజయస్థూపం పేరుతో పైలాన్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభలో జగన్ మాట్లాడతారు. ఇచ్ఛాపురం బహిరంగ సభ తర్వాత జగన్ విజయనగరానికి వెళ్తారు. అక్కడి నుంచి దురంతో ఎక్స్ప్రెస్ రైల్లో తిరుపతికి ప్రయాణం అవుతారు. రేపు కాలిబాటన తిరుమల చేరుకొని, శ్రీవారిని దర్శించుకుంటారు.
పైలాన్ ఎక్కడ ఉందంటే?
జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శివార్లలో జాతీయ రహదారి పక్కన పైలాన్ను ఏర్పాటు చేశారు. ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి 30 కిలో మీటర్ల ముందు, శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 130 కిలో మీటర్ల దూరంలో ఈ పైలాన్ను నిర్మించారు. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే దీనిని నిర్మించారు. ఈ నిర్మాణానికి మరోవైపు హౌరా - చెన్నై రైల్వే లైన్ ఉంది. ఇది అందరికీ కనువిందు చేస్తోంది. చాలామంది ఈ పైలాన్ వద్దకు వచ్చి ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. పైలాన్ బహుదా నది తీరానికి సమీపాన ఉంది.
ముగియనున్న జగన్ పాదయాత్ర: వంగవీటి రాధా అలక, ఆహ్వానం లేదా?
పైలాన్ పైభాగం ఇలా
నాలుగు ఉక్కు స్తంభాలు కింది నుంచి విడిగా పైకి వెళ్లి పైన నాలుగూ కలిసేలా ఈ పైలాన్ను ఏర్పాటు చేశారు. స్థూపం పై భాగాన పార్లమెంటు తరహాలో వృత్తాకారంలో వైసీపీ జెండా రంగులతో కూడిన ఒక టూంబ్ను ఏర్పాటు చేశారు. దానిపై పది అడుగుల ఎత్తులో పార్టీ పతాకం ఉంటుంది. ట్యూంబ్కు కింది భాగాన నాలుగు దిక్కుల వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోలను ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు వివిధ భంగిమల్లో ఉన్నాయి. పైలాన్ లోపలి భాగంలో చుట్టూ జగన్ తన పాదయాత్రలో ప్రజలను కలుసుకుంటూ వచ్చిన ఫోటోలను ఏర్పాటు చేశారు.
పైలాన్ కిందిభాగం ఇలా
పైలాన్ వద్దకు చేరుకునేందుకు 13 ప్లస్ 2 మెట్లు ఏర్పాటు చేశారు. ఈ పదమూడు మెట్లు ఏపీలోని పదమూడు జిల్లాలుగా పేర్కొన్నారు. మరో రెండు మెట్లను యాత్ర ప్రారంభమైన ఇడుపులపాయ ఒకటి, యాత్ర ముగిసిన ఇచ్ఛాపురం మరొకటిగా పేర్కొన్నారు. జగన్ అన్ని జిల్లాల్లో పర్యటించారు. జగన్ ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం వరకు నడిచిన వరుసలో ఆ మెట్ల పైన వరుసగా జిల్లాల పేర్లు రాశారు. జగన్ నడిచిన రూట్ మ్యాప్ కూడా ఉంది. కింద చిన్నలాన్ కూడా ఉంది. ఇందులోనే ఓ స్తంభం పక్కనే స్థూపం ఆవిష్కరణకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రహరి గోడ ఉంది. దీనిపై ప్రజా సంకల్ప పాదయాత్ర 2017-2019 అని ఉంది.