లగడపాటి చెప్పిందే నిజమైతే....హంగ్ రాదు.. మరి గెలుపెవరది..!
Recommended Video
ఆంధ్ర ఆక్టోపస్ తెలంగాణ ఎన్నికల ఫలితాల పై చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ లో జరిగే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులు పది మంది వరకు గెలిచే అవకాశం ఉందని చెప్పటం ప్రధాన రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతోంది. దీని పై టిఆర్యస్ సీరియస్ గానే రియాక్ట్ అయింది. ఇదే సమయంలో...అసలు స్వతంత్రులు ఈ స్థాయిలో గెలిస్తే..నిజంగా ఎవరికి నష్టం..అధికార పార్టీకా..లేక ప్రతిపక్షలకా.. ఇప్పుడు ఇదే చర్చ. స్వతంత్రులు ఎప్పుడు ఈ స్థాయిలో గెలుస్తారు. చరిత్ర ఏం చెబుతోంది..ఏం జరిగే అవకాశం ఉంది..
హోరాహోరీగా సాగుతున్న తెలంగాణ ఎన్నికల్లో రెండు ప్రధాన పక్షాలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరిస్థి తుల్లో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి తెర మీదకు వచ్చారు. తెలంగాణ ఎన్నికల పై పూర్తి స్థాయిలో కాకపోయినా..రాజకీయ పార్టీల్లో కలకలం రేపేలా జోస్యం చెప్పారు. అదే తెలంగాణ లో ఓటరు నాడి పూర్తి స్థాయిలో పసి గట్టలేకపోతున్నామని చెబుతూనే స్వతంత్ర అభ్యర్ధులు ఎనిమిది నుండి పది మంది వరకు గెలుస్తారని విశ్లేషించారు. సాధారణంగా ప్రజల్లోనే ఉంటూ...రాజకీయ కారణాలతో టిక్కెట్లు దక్కించుకోలేక పోయిన అభ్యర్ధుల వైపు ప్రజల్లో సానుభూతి ఉంటుంది. అటువంటి అభ్యర్ధులకు ప్రజలు పట్టం కడతారు. ఈ తరహా ఎన్నికల తీర్పు తెలుగు రాజకీయాల్లో కొత్త కాదు. గతంలోనూ ఇటువంటి ఫలితాలు ప్రభావం చూపాయి.
చరిత్ర చెబుతున్న వాస్తవం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్ర అభ్యర్దులు పెద్ద ఎత్తున గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 1994లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక ప్రభంజనం వీస్తున్నా ప్రతిపక్ష టీడీపీ క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితిని సరిగా అంచనా వేయలేకపోయింది. తాను 251 సీట్లకు పరిమితమై ఏకంగా 43 సీట్లు వామపక్షాలు, ఇతర మిత్రులకు సీట్లు కేటాయించింది. దాంతో టీడీపీ రెబల్స్ పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఏకంగా 12 మంది స్వతంత్రులు నెగ్గారు.
వారిలో ఎక్కువ మంది టీడీపీలో విలీనమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో 12 మంది స్వతంత్రులు, 2004లో 11 మంది స్వతంత్రులు నెగ్గారు. స్వతంత్రులుగా నెగ్గిన వారు సహజంగానే అధికారంలోకి వచ్చిన పార్టీకి దగ్గరవుతారు. తాజాగా లగడపాటి సర్వేలో తెలంగాణలోని 119 సీట్ల పరిధిలోనే పది స్వతంత్రులు నెగ్గుతారని అంచనా వేశారు. దీంతో..పాటుగా గెలిచే అవకాశం ఉన్న ఇద్దరి పేర్లు రోజుకు ఇద్దరి చొప్పున చెబుతానని ప్రకటించారు. దీని పై ఆసక్తి నెలకొంది. అదే సమయంలో దీని పై టిఆర్యస్ ఇసికి ఫిర్యాదు చేసింది.
సానుకూలత ఎవరికి..వ్యతిరేకత ఎవరిపై..
స్వతంత్రులు పది మంది గెలుస్తారనే అంచనాలతో రాజకీయ విశ్లేషకులు తమ బుర్రలకు పదును పెట్టారు. స్వతంత్ర అభ్యర్ధులు పదిమంది వరకు నిజంగా గెలిస్తే ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. 10 మంది స్వతంత్రులు గెలిస్తే..పోటీలో ఉన్న ప్రధాన పార్టీలపై ప్రజలు అంత ఆసక్తి చూపటం లేదా అనే చర్చ సైతం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు మాత్రం లగడపాటి చెప్పిన జోస్యం తప్పవుతుందని.. రెండు స్థానాల్లోనూ టిఆర్యస్ గెలుస్తుందని చెబుతున్నారు. బిజెపి సైతం లగడపాటి జోస్యాన్ని తప్పు బట్టింది. ఇక, టిఆర్యస్ నేతలు మాత్రం అంతర్గతంగా నారాయణ్పేట్ లో లగడపాటి చెప్పిన అభ్యర్ధి రెండో స్థానంలో ఉన్నాడని..తొలి స్థానంలో తమ పార్టీ అభ్యర్ధి ఉన్నట్లుగా క్షేత్ర స్థాయిలో తమకు స్పష్టత ఉందని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్న సమయంలో..ప్రతిపక్ష పార్టీ పై నమ్మకం పూర్తిగా లేని పరిస్థితుల్లోనే స్వతంత్ర అభ్యర్దులకు మద్దతు ఇంత పెద్ద మొత్తంలో లభిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, స్థానిక సమీకరణాలు..ప్రధాన పార్టీలు అక్కడక్కడ సీట్ల కేటాయింపుల్లో చేసిన పొరపాట్ల కారణంగానే..స్వతంత్ర అభ్యర్ధులు గెలుస్తారని..అదే సమయంలో ఎన్నికల ఫలితాలు మొత్తంగా అదే విధంగా ఉంటాయని చెప్పలేని పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
హంగ్ రాదు..మరి గెలుపెవరిది..
స్వతంత్ర అభ్యర్ధులు పది మంది వరకు గెలవటం ద్వారా 119 స్థానాలు ఉన్న తెలంగాణ లో హంగ్ ఖాయమనే అంచనా లు మొదలయ్యాయి. అయితే, దీని పైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్వతంత్రులు పది మంది గెలిచాన..ఇంకా 109 స్థానాలు తెలంగాణలో ఉన్నాయని...హంగ్ కు అవకాశం లేదని..స్పష్టమైన మెజార్టీ తోనే అధికారం దక్కించుకుంటారని లగడపాటి చెబుతున్నారు. అదే సమయంలో..మరో సెఫాలజిస్ట్, బిజెపి ఎంపి మాత్రం ప్రస్తుత లెక్కలు..అంచనాలు చూస్తుంటే తెలంగాణలో హంగ్ తప్పదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. తెలంగాణలో గెలుపెవరికి దక్కుతుందనే దాని పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక, లగడపాటి చెప్పినట్లుగా పది మంది వరకు స్వతంత్ర అభ్యర్దులు గెలిస్తే వారి మద్దతు కీలకం అయ్యే అవకాశాలు లేక పోలేదు. అదే సమయంలో వారు అధికారానికి చేరువైన పార్టీకి మద్దతు ఇస్తారా..లేక, వారికి గెలవటానికి సహకరించిన ప్రధాన పార్టీల్లో ని నేతల మాటకు విలువ ఇస్తారా అనేది ఆసక్తి కరమే. లగడపాటి ప్రకటించిన రెండు స్థానాల అభ్యర్ధుల వెనుక కాంగ్రెస్ నేతల పరోక్ష సహకారం ఉందని సమాచారం. దీంతో..ఇప్పుడు తెలంగాణ లో అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠకు కారణమవుతోంది.