ప్రభుత్వానికి పార్టీల జలక్ : అఖిల పక్షానికి పార్టీల దూరం : రాజకీయ లబ్ది కోసమే అంటూ..!
ఏపి ప్రభుత్వం అనుకున్నది ఒకటి..అయింది మరొకటి. ప్రత్యేక హోదా తో పాటుగా రాష్ట్ర హామీల సాధాన కోసం కార్యా చరణ ఖరారు కోసం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాన రాజకీయ పార్టీలు హాజరు కావటం లేదు. మాజీ ఎంపి ఉండవల్లి నిర్వహించిన సమావేశానికి హాజరైన పార్టీలు ప్రభుత్వ సమావేశానికి మాత్రం హాజరు కావటం లేదు. వైసిపి ఉండవల్లి సమావేశానికి సైతం దూరంగా ఉంది. దీంతో..ప్రభుత్వం ప్రజా సంఘాలు..ఉద్యోగ సంఘాల నేతలతో ఈ సమావేశం నిర్వహించనుంది.
ఉండవల్లి సమావేశానికి హాజరు..ఇక్కడ నో..
రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపి విభజన అంశాలు..సాధన కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పా టు చేసారు. ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. వైసిపి - సీపియం మినహా అన్ని పార్టీలు హాజరయ్యాయి. టిడిపి తో కలిసి ప్రత్యేక హోదా పై తాము వేదిక పంచుకోలేమని వైసిపి స్పష్టం చేసి సమావేశాన్ని బహిష్కరించింది. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయం స్పష్టం చేసారు. ఈ సమావేశంలో బిజెపి - టిడిపి నేతల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినా..ఉండవల్లి ఆహ్వానం మేరకు పార్టీల నేతలంతా సమావేశానికి వచ్చారు. ఎన్నికల్లో ఎలా పోరాడినా..రాష్ట్ర అంశాల విషయంలో కలిసి కట్టుగా ఉండాలని ఉండవల్లి పిలుపునిచ్చారు. సమావేశానికి హాజరనైన పార్టీలు ఆ అంశంలో మద్దతు ప్రకటించాయి.
ముఖ్యమంత్రి అధ్యక్షతన..ఆహ్వానం..
ఇదే సమయంలో ఉండవల్లి సమావేశం వెంటనే తాము అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితం ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు..ప్రజా సంఘాలు..ఉద్యోగ సంఘాలను ఆహ్వానించి భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేయాలని భావించింది. ఇప్పటికే ఫిబ్రవరి 1న ప్రజా సంఘాలు ఏపి బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ప్రవేశ పెడుతున్న బడ్జెట్ సమయంలో ఇక్కడ బంద్ చేయాలని డిసైడ్ అయ్యాయి. దీనికి టిడిపి సైతం మద్దతు ప్రకటించింది. ఇక, ఢిల్లీలో హోదా తో పాటుగా రాష్ట్ర ప్రయోజనాల అంశం లో దీక్ష చేయాలని సీయం నిర్ణయించారు. ఈ సమావేశంలో దీని పై ఒక నిర్ణయం తీసుకోవాలని.. అందరూ కలిసి రావా లని ఈ వేదిక ద్వారా కోరేందుకు ప్రభుత్వం సిద్దం అయింది. అయితే గతంలో ఇదే విధంగా ప్రభుత్వం నిర్వహించిన సమావేశాలకు వైసిపి - జనసేన- బిజెపి దూరంగా ఉన్నాయి. ఇప్పుడు, వైసిపి మినహా మిగిలిన పార్టీలు వస్తాయని ఏపి ప్రభుత్వం అంచనా వేసింది. ఆ అంచనా విఫలమైంది.
రాజకీయల లబ్ది కోసమే అంటూ..
అఖిల పక్ష సమావేశం పై మంగళవారం రాత్రి వరకు ఏ పార్టీ తమ నిర్ణయం అధికారికంగా ప్రకటించలేదు. వైసిపి మాత్రం ముందుగానే తాము చిత్తశుద్ది లేని సమావేశాలకు రామని తేల్చి చెప్పేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసారు.ఇది మొక్కుబడిగా కనిపిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమా అన్న సందేహాలు రేకె త్తిస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు సంఘటితంగా పోరాటం చేయడానికి జనసేన కట్టుబడి ఉందని చెబుతూనే సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ - వామపక్షాలు సైతం పవన్ దారిని ఎంచుకున్నాయి . కాంగ్రెస్ తమ తో కలిసి వస్తుందని టిడిపి అంచనా వేసింది. అయితే, వామపక్షాలు..కాంగ్రెస్ సైతం ఈ సమావేశం ద్వారా ప్రయోజనం లేదని తేల్చేసాయి. ఇక, ప్రజా సంఘాలు - ఉద్యోగ సంఘాల నేతలు, లోక్సత్తా వంటి పార్టీల నేత లతో ఈ సమావేశం జరగనుంది. ఇక, బిజెపి తమకు సమాచారం లేదని చెబుతోంది. ఉండవల్లి సమావేశానికి హాజరైన నేతలు..ప్రభుత్వం నిర్వహించే సమావేశానికి హాజ రు కారాదని నిర్ణయించటం ద్వారా రాజకీయంగా అధికార పార్టీ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.