పోలవరం ప్రాజెక్టు వద్ద కంపించిన భూమిః పగుళ్లు..రెండోసారి
అమరావతిః రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన అస్త్రమైన పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద భూమిలో ఇలా పగుళ్లు రావడం ఇది రెండోసారి. గతంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర తారు రోడ్డులో పగుళ్లు ఏర్పడిన విషయం తెలిసిందే. రోడ్డు సైతం రెండు మీటర్ల మేర కుంగిపోయింది. ఈ ఘటనతో అప్రమతమైన అధికారులు తాత్కాలిక చర్యలను తీసుకున్నారు. పగుళ్లను పూడ్చివేశారు. తాజాగా మరోసారి భూమి కుంగిపోవడం, పగుళ్లు ఏర్పడటం జలవనరుల శాఖ అధికారుల్లో కలవరానికి దారి తీసింది.
పోలవరం ప్రాజెక్టుకు ఆనుకునే ఉన్న స్పిల్వే రెస్టారెంట్ వద్ద భూమి కంపించింది. అనంతరం పగుళ్లు సంభవించాయి. వాహనాలు తిరుగాడే ప్రదేశానికి అత్యంత సమీపంలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీన్ని ప్రత్యక్షంగా చూసిన సందర్శకులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి దీనికి సమీపంలోనే డంపింగ్ యార్డు ఉండటం వల్ల పగుళ్లు ఏర్పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
వాహనాల రద్దీ వల్లేనా?
ప్రాజెక్టు పనుల్లో భాగంగా తవ్విన మట్టిని ఈ డంపింగ్ వద్ద పోస్తుంటారు. దాని పక్కనుంచే భారీ వాహనాలు వెళ్తుంటాయి. ప్రాజెక్టు పనుల కోసం ఉపయోగించే క్రేన్లు, జేసీబీలు, భారీ లారీలు, ట్రక్కులు నిరంతరం ఇదే మార్గంలో తిరుగాడుతుంటాయి. దీనికితోడు- చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం కోసం రోజూ పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలు ప్రాజెక్టు వద్దకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఫలితంగా- అదనపు లోడ్ ఎక్కువ కావడం వల్ల భూమి కుంగిందని, పగుళ్లు ఏర్పడ్డాయని చెబుతున్నారు.
సాధారణంగా ప్రాజెక్టును నిర్మించే చోట భూమి కొంత వదులుగా ఉంటుందని, నిర్మాణం ఉన్న ఏ ప్రాజెక్టు వద్ద అయినా సరే ఇలాగే పగుళ్లు వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఏ ప్రాజెక్టును కూడా సందర్శించడానికి వందల సంఖ్యలో సందర్శకులు రారు. అదే స్థాయిలో అదనపు వాహనాలు గానీ తిరుగాడవు. ప్రాజెక్టు నిర్మాణం కోసం వినియోగించే వాహనాలు మాత్రమే కనిపిస్తాయి. పోలవరం మాత్రం వాటన్నింటికీ భిన్నం. ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ఓటుబ్యాంకుగా చూస్తోంది. నిత్యం వందలాది మంది సందర్శకులను ప్రభుత్వ ఖర్చుతో ప్రాజెక్టు వద్దకు తరలిస్తోంది. ఫలితంగా- వాహనాల రద్దీ, జనం తాకిడి అధికమైంది. ఇదీ ఓ కారణమనే అభిప్రాయం జనంలో నెలకొంది.