అదీ ఎన్నికల స్టంటే.. కేసీఆర్ కామెంట్లపై అనిల్ కుమార్ కౌంటర్ అటాక్
ప్లీనరీలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు కాకరేపాయి. ఏపీలో పార్టీ పెట్టాలని తనను చాలా మంది కోరుతున్నారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. కేసీఆర్ అన్నట్టు.. ఏపీలో కరెంటు కోతలు లేవని స్పష్టం చేశారు. బొగ్గు సమస్య ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాలేదన్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు అవుతున్నాయని మంత్రి అనిల్ తేల్చి చెప్పారు.
ఏపీలో కూడా
తెలంగాణలో అమల్లో ఉన్న పథకాలను ఏపీలో అమలు చేయాల్సిన అవసరమే లేదన్నారు. ఎన్నికల స్టంట్ లో భాగం గానే.. కేసీఆర్ అలా టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడి ఉండవచ్చని మంత్రి అనిల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దళిత బంధు పథకంపై అనిల్ స్పందించారు. తెలంగాణలో ఇప్పటివరకూ ఒకే ఒక్క నియోజకవర్గంలో ఆ పథకాన్ని అమలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకం అమలులో లేదని ఆయన చెప్పారు.
ఆంధ్రలో పార్టీ..
ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారని.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిల్ స్పందించారు. కావాలనుకుంటే ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చని చెప్పారు. తమకు ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. హైదరాబాద్లో గల హైటెక్స్ లో ఇవాళ నిర్వహించి టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ అగ్గిరాజేశాయి.
Recommended Video
చీకట్లు..
ఏపీకి సంబంధించిన విషయాలను కేసీఆర్ ప్రస్తావించారు. ఏపీ నుంచి తెలంగాణ విడిపోతే.. కొత్త రాష్ట్రంలో చీకట్లు కమ్ముకుంటాయని ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు ఏపీలోనే చీకట్లు ఉన్నాయని చెప్పారు. సంక్షేమ పథకాల విషయంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని.. తెలంగాణ పథకాలనే ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని చెప్పుకొచ్చారు. దీనిపై మంత్రి అనిల్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ఏపీలో పథకాలు ఎక్కువగా అమలు అవుతున్నాయని తేల్చి చెప్పారు. ఏపీలో కరెంటు కోతలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయని చెప్పారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని కేసీఆర్ అన్నారు.