బాబూ.. ప్రతీది రాద్దాంతమేనా.. మంత్రి అవంతి శ్రీనివాస్ విసుర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రతి విషయానికీ రాద్ధాంతం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో తూర్పు గోదావరిలో కర్ఫ్యూ ఉండడం వల్లే జులైలో బోటింగ్ ప్రారంభం అవుతుందని వివరించారు. ప్రతీ దానిని రాజకీయం చేయాలనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ఏదో సాకు చూపి.. తప్పులు లెక్కబెట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
విదేశీ పర్యాటకుల కోసం విదేశీ మద్యం అందుబాటులో ఉంచుతామని మంత్రి అవంతి శ్రీనివాస్ వివరించారు. అన్ని రాష్ట్రాల్లో టూరిస్టుల కోసం మద్యం ఉంటుందని.. ఏపీలోనే కాదని చెప్పారు. దీనిని తాము కొత్తగా ఏర్పాటు చేయలేదని, గతంలోనూ ఇదే విధానం అమల్లో ఉందని తెలిపారు. ఈ విషయంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. పర్యాటక రంగ ప్రచారాన్ని రాజకీయాలతో ముడి పెట్టకూడదని ఆయన అన్నారు.
మాయ మాటలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్లో కూర్చున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ ఏది చెబుతారో అది చేస్తారని మంత్రి అవంతి వివరించారు. తమ ప్రభుత్వం కరోనా అత్యధిక టెస్టులు చేసిందని, అత్యధికంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసిందని తెలిపారు. ఈ విషయం అందరికీ తెలుసు అని గుర్తుచేశారు. కావాలని విమర్శలు చేయడం సరికాదని చెప్పారు.
ఏపీలో తొలి డెల్టా వేరియంట్ కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భయాందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా జారీచేసింది. ఏపీతోపాటు 7 రాష్ట్రాలను అలర్ట్ చేసింది.