టీడీపీ అడ్రస్ గల్లంతు.. మంత్రి బొత్స కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని ఫైరయ్యారు. చంద్రబాబుకు మళ్లీ పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు విలవిల అంటే అయిపోతుందా.. ప్రజలకు తెలుసు కళ ఉన్న పార్టీ ఏదో అంటూ ఎద్దేవా చేశారు. మూడేళ్లు ఇంట్లో పడుకున్న చంద్రబాబు ఇప్పుడు అధికార పార్టీపై యుద్ధం అంటూ ప్రజల్లోకి వస్తున్నాడని, చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదని ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు.
వారంతా టీడీపీ కార్యకర్తలే..
మహానాడుకు వచ్చిన వారంతా టీడీపీ కార్యకర్తలేనని, ప్రజలెవరూ రాలేదంటూ బొత్స కామెంట్ చేశారు. ధరలు పెరిగాయని చంద్రబాబు అంటున్నాడని, పెరగడానికి కారణం ఎవరో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ధరల విషయంలో కేంద్రాన్ని ఎందుకు అడగలేక పోతున్నాడో చంద్రబాబు చెప్పాలని బొత్స అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ఊహించుకొని ప్రచారం చేస్తున్నాడని, ముందస్తుకు వెళ్తున్నాం అని చెప్పడానికి చంద్రబాబు ఎవరు అంటూ బొత్స సత్యనారాయణ నిలదీశారు.
ఐదేళ్లు అవకాశం..
ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని, ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటని బొత్స అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుందని బొత్స జోస్యం చెప్పారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో కేంద్రం నుండి వచ్చిన నిధులు ఎన్ని? మూడేళ్ల పాలనలో ఎన్ని నిధులు వచ్చాయి అనే విషయాలపై శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల్లో సఫలీకృతం అవుతున్నామని బొత్స తెలిపారు. జగన్ను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు.
వైసీపీ వైపు..?
ప్రజలంతా వైసీపీ వైపు ఉన్నారని, మంత్రులు చేపట్టిన బస్సు యాత్రకు విశేషమైన ప్రజాధరణ లభిస్తుందని బొత్స తెలిపారు. చంద్రబాబు ఎవరితో కలిసి వస్తాడో రానివ్వండి.. మేము మాత్రం సింగిల్గానే ఎన్నికలకు వెళ్తామంటూ బొత్స అన్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని, ఈసారి టీడీపీ కనుమరుగు కావటం ఖాయమని, ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని బొత్స అన్నారు.