ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం: రిజిస్ట్రేష్ కార్యాలయాలకు నో క్రిస్మస్ హాలిడే
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం శ్రీకారం చుట్టబోతోన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని యు కొత్తపల్లి మండలంలోని కొమరగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనికి గుర్తుగా అక్కడే ఓ పైలాన్ను ఆవిష్కరిస్తారు. కొమరగిరిలో వైఎస్ఆర్ జగనన్న కాలనీ పేరు మీద ప్రభుత్వం 367 ఎకరాలను సేకరించింది. కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 16,500 మంది లబ్ధిదారులకు ఇక్కడ ప్లాట్లను ఇవ్వనున్నారు.
Recommended Video
10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా..
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు కొనసాగనుంది. జిల్లాల్లో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఉరందూరు వద్ద వైఎస్ జగన్ రెండోదశ ఇళ్ల పట్టాల పంపిణీని చేపడతారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 30.75 లక్షల మందికి ఇంటి పట్టాలను అందించనున్నారు. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికీ శంకుస్థాపనలను సైతం నిర్వహించబోతోన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
క్రిస్మస్ సెలవు రద్దు..
అర్హుల పేర్ల మీద ఇళ్ల పట్టాలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయాన్నింటికీ ప్రభుత్వం క్రిస్మస్ సెలవును రద్దు చేసింది. ఆయా కార్యాలయాలన్నీ యధావిథిగా పనిచేస్తాయని పేర్కొంది. 2.60 టిడ్కో ఇళ్ల సేల్ అగ్రిమెంట్లను కూడా ప్రభుత్వం లబ్దిదారులకు అందజేస్తుంది. తాము అధికారంలోకి వస్తే..అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలను ఇస్తామని ఇదివరకు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
పలుమార్లు వాయిదా పడ్డా..
ఇదే విషయాన్ని మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రకటించారు. ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించినా.. అవాంతరాలు ఏర్పడ్డాయి. అనంతరం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిందీ కార్యక్రమం. ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించాలని భావించినా కుదర్లేదు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
తాజాగా క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాల నాడు శ్రీకారం చుట్టారు. ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ప్రారంభించకుండా స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటీషన్ను హైకోర్టు కొట్టివేసింది. స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఒకేసారి 30 లక్షలమందికి పైగా అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఇళ్ల పట్టాల పంపిణీని చేపట్టినప్పటికీ.. ఇన్ని లక్షల మంది అర్హులకే అందేలా చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఓ మైలురాయిగా ఈ పథకం నిలిచిపోతుందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.