వచ్చే నెల గట్టెక్కాలంటే 30 వేల కోట్లు కావాలి..! నిధుల వేటలో ఏపి ప్రభుత్వం..!!
Recommended Video
అమరావతి/ హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం హంగూ ఆర్భాటం పైకి బాగానే కనిపిస్తున్నా ఆర్థికంగా చితికి పోయినట్టు తెలుస్తోంది. సుమారు 30 వేల కోట్లు ఖర్చుపెడితే కానీ చంద్రబాబు సర్కారు ఫిబ్రవరి నెలను దాటలేదు. దీంతో అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పిటకే రిజర్వ్ బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అలాగే వివిధ కార్పొరేషన్ల ద్వారా కనీసం 15 నుంచి 20 వేల కోట్లు అప్పుతేవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటుగా రైతు సాధికార సంస్ధ ద్వారా మరో 8 వేల కోట్లు, ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం ద్వారా మరో 4800 కోట్లు తెచ్చి ఫిబ్రవరి నెల గడపాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ యోచన చేస్తోంది.
ఏపి ప్రభుత్వానకి ఫిబ్రవరి గండం..! అప్పుకోసం తిప్పలు..!!
ఫిబ్రవరి నెలలో ఖర్చుపెట్టుకోవడానికి సంబంధించిన నిధుల కోసం ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ప్రతినిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. సమయం తక్కువగా ఉందని. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి అప్పు సమీకరించకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దారుణంగా దెబ్బతింటుందనే ఆందోళన అధికారవర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీంతో ఏపి ప్రభుత్వం అప్పు పుట్టే ప్రతి అవకాశం పైన సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నిధుల కోసం ఏపి ప్రభుత్వం తంటాలు..! రిసర్వ్ బ్యాంకులో ఓడీ కోసం ప్రయత్నాలు..!!
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు ఖజానాపై మోయలేని భారాన్ని మోపుతున్నాయి. ఇటీవలి కాలంలో చంద్రబాబు ప్రకటించిన నూతన పథకాలన్నీ నెరవేర్చాలంటే ఒక్క ఫిబ్రావరి మాసంలోనే 30 వేల కోట్ల రూపాయల నిధులు అవసరపడతాయని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అందులో కనీసం పదో వంతు రాబడి కూడా ఈ నెలలో ఏపీ ఖజానాకు జమ అయ్యే పరిస్ధితులు లేదు. ఓ వైపు జీతాలు మరో వైపు కొత్త సంక్షేమ పథకాలు నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిధుల వేటలో పడింది.
ఇబ్బందిగా పరిణమించిన రుణమాఫీ నిదులు..! సమీకరణలో ప్రభుత్వం..!
అంతే కాకుండా డ్వాక్రా వడ్డీ రాయితీ కోసం 2450 కోట్లు పెండింగ్ లో ఉంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు పెండింగ్ లో ఉన్న వడ్డీ రాయితీ చెల్లించకపోతే డ్వాక్రా మహిళలకు కోపం వస్తుంది. ఇక కొత్తగా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఇస్తానన్న బహుమానాలకు 9400 కోట్లు ఖర్చవుతాయి. ఇది కూడా ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపే నెరవేర్చాలి. అంటే ఫిబ్రవరి మాసంలోనే ఈ 9400 కోట్లు ఖర్చుపెట్టాలి. ఇక ఇప్పటికే సకాలంలో చెల్లించకపోవడంతో పెండింగ్ లో ఉన్న బిల్లులు 12000 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ చెపుతోంది.
30వేల కోట్లు అవసరం..! ఎలా సమకూరుస్తారోనని ఉత్కంఠ..!!
ఇక ఇదే నెల చెల్లించాల్సిన 12 వేల బిల్లుల్లో కేవలం నీటిపారుదల శాఖ బిల్లులే 4800 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంట్రాక్టర్లతో పెట్టుకునే పరిస్ధితి ప్రభుత్వానికి ఉండదు. ఇక తడిసిన ధాన్యం కొనుగోలుకు, వివిధ పధకాల సబ్సిడీకి వందల కోట్ల నెలవారీ ఖర్చు ఉంది. ఇవన్నీ ఒకెత్తైతే ప్రభుత్వోద్యోగుల జీతాలే 3600 కోట్లు చెల్లించాలి. దేన్ని ఆపినా ఉద్యోగస్తుల జీతాలు ఆపితే ఇంక అంతే సంగతులు. ఈ మొత్తం వ్యవహారాలన్నీ చక్కబెట్టాలంటే 30 వేల కోట్ల వరకూ అవసరమవుతాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఎక్కడ నుంచి తీసుకురావాలా అని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.